ఆంక్షలు ఎన్ని ఉన్నా, పోలీసులు అడ్డంకులు సృష్టించినా ముందుకే.. జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు
డీఎస్సీ అక్రమాలపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం కోసం సోమవారం రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే యత్నం చేసినా నిరసనల హోరు తగ్గలేదు. ముందస్తు నోటీసులు, ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు, మైకులు లాక్కోవడం .. ఇలా ఎక్కడికక్కడ పోలీసుల నిర్బంధాల మధ్యే జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయలని డిమాండ్ చేస్తూ యువత, వైఎస్సార్ సీపీ నేతలు ర్యాలీలతో ప్రభుత్వంపై నిరసన గళం వినిపించారు.
యువతలో
గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా కొద్దిసేపటికి భారీ ఎత్తున తరలివచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీ కొనసాగించేందుకు అనుమతి కోరినా పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ తీరుకు నిరసనగా యువత కదం తొక్కారు. డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ప్రతి నియోజకవర్గంలోనూ భారీగా ర్యాలీలు జరిగాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. మచిలీపట్నం నియోజకవర్గంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని, రైతులకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి కోటవారితుళ్లసెంటర్, కోనేరుసెంటర్, ప్రధాన రహదారి మీదుగా లక్ష్మీటాకీసు సెంటరు, పరాసుపేట సెంటర్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) స్వగృహానికి పోలీసులు చేరుకొని ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని ముందస్తుగా నోటీసు అందజేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా కొడాలి నాని స్వగృహానికి తరలి రావడంతో ర్యాలీని ప్రారంభించి రాజేంద్రనగర్ మీదుగా ఏలూరు రోడ్ వరకు సాగింది.
పెనమలూరు నియోజకవర్గంలో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో కంకిపాడు సెంటర్లో డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కానూరు గ్రామం నుంచి మోటార్ బైక్లతో ర్యాలీగా కంకిపాడు ప్రభుత్వాస్పత్రి సెంటరు వరకు చేరుకున్నారు. అనంతరం కంకిపాడు సీఐ రవికుమార్ ఇతర సిబ్బంది ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. రోప్ల సహాయంతో నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. బందరు రోడ్డుపై ఆందోళన చేశారు.


