ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో శ్రావణ మాసం ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శీనానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కుంకుమార్చనకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, భక్తులకు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన టికెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
12న దుర్గగుడి సిబ్బంది సారె
ఈ నెల 12వ తేదీ దుర్గగుడి సిబ్బంది, అధికారులు అమ్మవారికి సారెను సమర్పించనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
రాజగోపురం ఎదుట జెండా వందనం
‘స్వాతంత్య్ర’ వేడుకలను ఈ ఏడాది రాజగోపురం ఎదుట నిర్వహించాలని ఈవో ఆలయ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో కిషోర్కుమార్, ఎసీ రంగారావు, ఎఈవోలు ఎన్. రమేష్బాబు, గంగాధర్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


