చిలకలపూడి(మచిలీపట్నం): భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి టి. రాజావెంకటాద్రి శుక్రవారం తీర్పు చెప్పారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కట్టావానిపాలెం గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు భార్య జయలక్ష్మిని వ్యసనాలకు లోనై తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె కూలీకి వెళ్లి వచ్చిన డబ్బులు కూడా లాక్కొని తాగుడుకు బానిసయ్యాడు. అయితే జయలక్ష్మి పేరుపై ఉన్న రొయ్యల చెరువును అమ్మి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె చెరువు అమ్మకపోవటంతో 2025 జూలై 10వ తేదీన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై కుమారుడు కట్టా రాము కలిదిండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఏపీపీ నిరంజన్ 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పెద్దిరాజుపై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.
ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు
జూపూడి(ఇబ్రహీంపట్నం): స్వామినారాయణ గురుకుల పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ మండలంలోని జూపూడి గ్రామం వద్ద బోల్తాపడింది. 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేతనకొండలోని గురుకుల పాఠశాల విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులతో విజయవాడ వైపు వెళ్తున్న బస్సు మార్గ మధ్యలో అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏడుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతిల్లింది. నివాసాల సమీపంలో ప్రమాదం జరగడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలతో బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఆందోళనతో భీతిల్లిన వారిని సమీప నిమ్రా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలు అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


