రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ, గుంటూరు డివిజన్లలోని కీలక రైల్వేస్టేష న్లు, ప్రయాణికుల మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. స్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్తు సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. విజయవాడ డీఆర్ఎంతో కలసి రాయనపాడు ఆర్ఓబీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించారు. గంగినేని స్టేషన్ను తనిఖీ చేసి ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఎర్రుపాలెం స్టేషన్లో యార్డు ప్రణాళిక, ప్రతిపాదిత నంబూరు కొత్త లైన్ల పనులను అధికారులతో సమీక్షించారు. ఆ మార్గంలో ట్రాక్, స్టేషన్ అలైన్మెంట్ను పరిశీలించారు. అనంతరం మధిర స్టేషన్ను తనిఖీ చేసి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని అంచనా వేసి పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.
జీఎంను కలిసిన ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు
దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ విజయవాడ డివిజన్ పర్యటన సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ కమిటీ నేతలు శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ విజయవాడ డివిజన్ అధ్యక్షుడు బి.వినా యక్ డివిజన్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జీఎంకు వినతిపత్రం సమర్పించారు. జీఎం సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు నాయక్ తెలిపారు. జీఎంను కలసినవారిలో అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ గుజ్జల కృష్ణ, బాలకృష్ణ బైర్వా, నావల్ కిషోర్మీనా, జి.యోహను, వి.వి.రత్నం, ఇందర్సింగ్ మీనా, పలు విభాగాల బ్రాంచ్ నాయకులు ఉన్నారు.


