మీకోసంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు
కోనేరుసెంటర్: మీకోసంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించటంలో అధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మీకోసంలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని, అటువంటి ఆరోపణలు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీకోసంలో మొత్తం 56 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.
ప్రధానమైన అర్జీలు
● పామర్రుకు చెందిన శ్రీను అనే బాధితుడు ఎస్పీని కలిసి తన తాతల నాటి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని బంధువులు నకిలీ పత్రాలు చూపించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని వాపోయాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
● చల్లపల్లి నుంచి లక్ష్మి అనే బాధితురాలు తనకు వివాహం జరిగి ఆరేళ్లయిందని, అప్పటి నుంచి అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ప్రయోజనం లేకపోయిందని, అత్తింటి వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.
● కంకిపాడుకు చెందిన బసవయ్య అనే రైతు తన పొలానికి వెళ్లే మార్గాన్ని సరిహద్దుదారుడు అడ్డుకుంటూ పొలంలోకి వెళ్లనీయటం లేదని, అదేమని ప్రశ్నించినందుకు తనను దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడుతున్నాడని వాపోయాడు. విచారణ జరిపించి తనకు రక్షణ కల్పించాలని కోరాడు.
● ఘంటసాల నుంచి వచ్చిన నరేష్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న తనకు తన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడని, డబ్బు తీసుకుని ఏడాదవుతున్నా ఉద్యోగం ఇప్పించకపోగా, ఉద్యోగం గురించి అడిగితే బెదిరిస్తున్నాడంటూ వాపోయాడు. విచారణ జరిపించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.


