జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి హాజరైన కోట సామ్రాజ్యం
మచిలీపట్నంఅర్బన్: గన్నవరానికి చెందిన దళిత మహిళ కోట సామ్రాజ్యం కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై సోమవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లవరపు నవీన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు కోట సామ్రాజ్యం, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. విచారణ అనంతరం కోట సామ్రాజ్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుల ధ్రువీకరణ పత్రాన్ని వివాదాస్పదం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తన నివాసంపై టీడీపీ నాయకులు దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, తాను దళిత మహిళను కాదంటూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేయించడం విచారకరమన్నారు. ఆ ఫిర్యాదు కారణంగానే జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరైనట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్ విక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులపై వేధింపులు పెరిగాయని ఆరోపించారు. కోట సామ్రాజ్యం ఇంటిపై దాడి చేసి ఆస్తి ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు, దళిత జేఏసీ నాయకులు భూపతి అంబేద్కర్, జక్కుల ఆనంద్, గడిదేశీ రాజు, కొక్కిలిగడ్డ శరత్, బేతపూడి రవి, బాల యేసు తదితరులు పాల్గొన్నారు.


