కొనసాగుతున్న భక్తబృందాల రాక
సారె సమర్పణకు రెండు గంటల సమయం
సారెతో అమ్మవారి ప్రతిమ సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పలు భక్త బృందాలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన భక్త బృందాల రాక సాయంత్రం వరకు కొనసాగింది. సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భక్తులకు రూ.100, రూ.300 క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పిస్తున్నారు. సారె సమర్పించిన భక్త బృందాలు, భక్తులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, భక్త బృందంలోని సభ్యులకు పసుపు, కుంకుమ, ప్రసాదాలను ఇచ్చి పుచ్చుకున్నారు. సారె సమర్పించిన భక్తులతో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చారు.


