పర్నాస గ్రామంలో 300 ఎకరాల్లో వెదజల్లిన పంట ఎండుముఖం సకాలంలో సాగునీరు అందించని చంద్రబాబు ప్రభుత్వం నీరు రాకపోతే ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు క్రాప్ హాలిడేనే పాలకులు పట్టించుకోవాలంటూరైతుల వేడుకోలు
సాగునీరు లేక నిండా మునిగాం
చేపల చెరువులకు ఇస్తున్నారు
గత ప్రభుత్వంలో మేలు
గుడివాడరూరల్/కృత్తివెన్ను: రైతుల పక్షపాతి అని చెప్పుకొంటున్న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగునీరు అందక వరిచేలు ఎండు ముఖం పట్టాయి. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, అధికారుల అలసత్వం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూలై నెల సగం గడిచినా పంట కాలువల్లో సాగునీటి ప్రవాహం జాడ కనిపించడం లేదు. వర్షాలు సైతం ముఖం చాటేయడంతో వెదజల్లిన వరి చేలు ఎండిపోతున్నాయి. గుడివాడ మండ లంలోని పర్నాస గ్రామంలో 300 ఎకరాల్లో రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.7 వేలకు పైగా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ చేలు నీటి తడి అందక ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే 60 శాతం పొలాలు ఎండిపోయాయి. మరో రెండు మూడు రోజుల్లో సాగునీరు అందకపోతే వెదజల్లిన పంట పొలాలు పూర్తిగా ఎండి పోయి నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
రైతుల పాలిట శాపం
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సకాలంలో సాగునీరు అందించిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముందు చూపుతో రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సకాలంలో సాగుకు నీరు అందించారని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు.
సాగునీటి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తించిన పలువురు రైతులు వర్షాలపైనే భారం వేసి వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేపట్టారు. మరి కొందరు కాలువలపై ఆధారపడి సాగు చేసేందుకు నారు మడులను సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు నెల సమీపిస్తున్నా కాలువలకు సాగునీటి విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల్లో సాగునీరు ప్రవహించ, వర్షాలు పడక నారు మడులను, వెదజల్లిన చేలను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వ తీరుతో ఈ ఏడాది ఖరీఫ్లో వరి సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిండం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎడారిన సాగుభూములు
కృత్తివెన్ను మండలం వరిచేలు ఎండుముఖం పట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా తీరప్రాంతంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరులో సాగుభూములు ఎడారుల్లా మారాయని ఆర్టీసీ కృష్ణాజోనల్ మాజీ చైర్మన్ పిన్నెంటి మహేష్, పలువురు రైతులు వాపోయారు. ఈ ప్రాంతాల్లో వరి సాగు మినహా మరో ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేదన్నారు. గతేడాది జూన్ 25 నాటికి వరి నాట్లు పూర్తయ్యా యని, ఈ ఖరీఫ్లో జూలై నెల సగం గడిచినా అధిక శాతం నారుమడులు కూడా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి సాగు నీరివ్వలేకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరుతున్నారు.
గతంలో ఏటా జూన్ మొదటి వారంలో కాలువలకు సాగునీరు విడుదలయ్యేది. కాలువలపై ఆధారపడే వరి సాగు చేసేవాళ్లం. ఈ సారి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టలేదు. మరోవైపు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. ఎన్నిసార్లు ప్రాథేయ పడినా అధికారులు పట్టించుకోవడంలేదు. విత్తనాలు వెదజల్లి నెల కావస్తున్నా నీటి తడులు అందక పైరు ఎండిపోతోంది.
– సురేష్, రైతు పర్నాస గ్రామం,
గుడివాడ మండలం
మా గ్రామంలో 300 ఎకరాలకు పైగా వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేశాం. దిగు వనున్న చేపల చెరువులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు అందిస్తు న్నారు. జూలై సగం గడిచినా పంట పొలాలకు నీరు అందించడం లేదు. కాలువల్లో పూడిక తీయకపోవడం మా పాలిట శాపంగా మారింది. ఇప్పటికై నా అధికారులు శ్రద్ధ చూపి పంటల సాగుకు నీరు అందించాలి.
–వెంకటేశ్వరరావు, రైతు పర్నాస గ్రామం, గుడివాడ మండలం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఏనాడూ రైతులకు సాగునీరు సకాలంలో అందని పరిస్థితి లేదు. రైతులకు జూన్ మొదటి వారంలోనే సాగునీరు అందించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేటముంచుతోంది. ప్రభుత్వం కళ్లు తెరచి రైతులకు నీరు అందించకుంటే వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన చేస్తాం.
– గోళ్ల రామకృష్ణ,
జెడ్పీటీసీ సభ్యుడు, గుడివాడ


