సెల్ఫోన్లకు బానిసవుతున్న విద్యార్థులు చిన్న వయసులోనే విపరీత ధోరణులు ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే మేలు
కౌటాల: విద్యార్థులకు క్రమశిక్షణ అత్యవసరం. అయితే విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో ఉపాధ్యాయులు దండిస్తే తిరగబడ్డాడో విద్యార్థి.. అంతేకాక ‘నువ్వు కొడితే నేనూ కొడతా..’ అన్నట్లుగా ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్న ఘటన గత నెల 6న కౌటాల మండలంలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది. పిల్లలో దారి తప్పుతున్న ప్రవర్తనకు ఈ ఘటన సాక్ష్యంగా నిలిచింది. ఉపాధ్యాయులపైనే కాకుండా సొంత తల్లిదండ్రులపైనా తిరగబడుతుండం ఆందోళన కలిగించే అంశం. బాలల్లో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురిచేస్తుండగా, చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయనేది అంచనా వేయలేకపోతున్నారు.
అవసరమైతే కౌన్సెలింగ్ తప్పనిసరి
పిల్లలు తల్లిదండ్రుల నుంచే అలవాట్లు, సంస్కా రం నేర్చుకుంటారు. కానీ పోటీ ప్రపంచంలో కన్నవారికి మంచీచెడులు చెప్పే సమయం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. బిడ్డల డిమాండ్లను రెండో ఆలోచన లేకుండానే అంగీకరిస్తుండటంతో వారిని అదుపు చేయడం కష్టమవుతోంది. ప్ర మాదకరమైన ప్రవర్తనతో కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చిస్తూ ఉండాలి. నిత్యం నిఘా పెట్టి చెడు అలవాట్లు ఉన్నవారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు దృష్టి సారించాలి
మన పిల్లలే దేశానికి రా నున్న మరో తరం. సోష ల్ మీడియాలో పిల్లలు ఏది చూస్తున్నారో బయ ట కూడా అలాగే ప్రవర్తి స్తున్నారు. స్మార్ట్ఫోన్కు బానిసైతే కంటి, నిద్రలేమి, ఒత్తిడి, కోపం, తలనొప్పి, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి. పిల్లలతో సమయం గడపడంతో పాటు వారి ప్రవర్తనపై నిరంతరం దృష్టి సారించాలి. – కార్తీక్, వైద్యాధికారి, కౌటాల
మొబైల్, మత్తుకు బానిసలుగా..
జిల్లాలో 1 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు 1.50 లక్షల మందికి పైగా ఉన్నారు. పిల్ల లు అన్నం తినడానికి మారం చేస్తున్నారనో.. ఏడుస్తున్నారనో.. కారణం ఏదైనా రెండేళ్లు కూడా నిండని పసిపిల్లల చేతుల్లో కి స్మార్ట్ఫోన్ చేరుతోంది. ప్రారంభంలో సరదాగా అనిపించినా క్రమేపీ వారికి వ్యసనంగా మారుతోంది. స్మార్ట్ఫోన్ తెగ వాడేస్తూ రీల్స్తోపాటు గేమ్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఫలితంగా చాలామంది తెలి యకుండానే మానసిక రోగుల్లా మారుతున్నారు. అంతేకాక హైస్కూల్ దశ నుంచే విద్యార్థులు సిగరెట్, గంజాయి, మద్యం తాగుతూ మద్యానికి బానిసలుగా మారుతున్నారు. పిల్లలను మందలిస్తే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొందరు టీచర్లు ముందడుగు వేసినా వారికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తిరుగుబాట్లు తప్పడం లేదు.


