కౌటాల: జిల్లాలో మరోసారి నకిలీ నోట్ల వ్యవహా రం కలకలం రేపుతోంది. కాగజ్నగర్కు చెందిన ఓ వ్యాపారికి రూ.500 ఫేక్ నోటు రావడం ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు వ్యాపారి కౌటాల మండలంలోని పలు దుకాణాలకు సరుకులు సరఫ రా చేస్తారు. ఇటీవల సరుకుల డబ్బులను ఆయా దుకాణాదారుల వద్ద నుంచి వసూలు చేసుకుని తిరిగి వెళ్లాడు. మరుసటి రోజు కాగజ్నగర్లోని ఓ బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా అందులో ఒక టి రూ.500 నోటు నకిలీదని బ్యాంకు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స రిహద్దులోని కౌటాల మండలంలో నకిలీ నోట్ల చలా మణి అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర నుంచేనా..?
కౌటాలలో కొన్ని నెలల నుంచి నకిలీ నోట్లు చలా మణి అవుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం రూ.50 నోట్లు కనిపించగా, ప్రస్తుతం రూ.500 నో ట్లు దర్శనమిస్తున్నాయి. ఇవి సరిహద్దులోని మహా రాష్ట్ర నుంచి సరఫరా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారులు అధిక ధర వస్తుందనే ఆశతో పంటలను మహారాష్ట్రకు తీసుకెళ్తారు. నగదు మొత్తం రూ.500 నోట్లు ఇస్తారు. ఇదే అదునుగా మహారాష్ట్రలోని ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, సిర్పూర్ రైతులకు విష యం తెలియకుండా కొంత మొత్తం నకిలీ నోట్లను అంటగడుతున్నారనే ఆరోపణ ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కావడంతో రైతులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నకిలీ నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు కూడా నిత్యం జిల్లాలోని మార్కెట్లకు వస్తుంటారు. దీంతో ఫేక్ కరెన్సీలో ఎలా వస్తుందో గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. పెద్ద వ్యాపారులు, బ్యాంకుల వద్ద మాత్రమే లెక్కింపు యంత్రాలు ఉండటంతో సులువుగా దొంగనోట్లను గుర్తిస్తున్నారు. చిరువ్యాపారులు, రైతులు మాత్రం బాధితులుగా మిగులుతున్నారు.


