ఆసిఫాబాద్: రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయం, వాతావరణ మార్పులు, విద్యారంగ అభివృద్ధి, ప్రజా రక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి 19.68 లక్షల క్వింటాళ్ల విత్తనాల అవసరం కాగా, 74.44 లక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది రూ.3.98 కోట్ల విలువైన 530.43 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని 73 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. జిల్లాస్థాయి ప్రత్యేక తనిఖీ బృందాలు విత్తన విక్రయ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, సరిద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, కాగజ్నగర్ ఆర్డీవో కృష్ణయ్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, డీఎంహెచ్వో సీతారాం, డీఈవో సచ్చిదానంద చారి, డీఏవో వెంకటి, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ పూర్తి చేసేందుకు సహకరించాలి
సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 76 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


