వేమనపల్లి: చామనపల్లి శివారులో వివాదస్పద భూమిలో మళ్లీ అలజడి రేగింది. తమకు జీవనాధారమైన భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతున్నారని గ్రామానికి చెందిన నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులోని భూమి 20 ఏళ్లుగా అటవీ, రెవెన్యూ శాఖల మధ్య పెండింగ్లో ఉంది. ఆ భూమి చెన్నూర్ రిజర్వ్ ఫారెస్ట్ 125, 126 కంపార్ట్మెంట్గా అటవీ అధికారులు పేర్కొంటుండగా 3 నెలల క్రితం హద్దులు ఏర్పాటు చేసి కందకం తవ్వారు. గురువారం మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో చెన్నూర్ ఎఫ్డీవో సర్వేశ్వర్ రావ్, రూరల్ సీఐ కృష్ణ, ఎఫ్ఆర్వో హఫీజోద్దీన్, ఎస్సై జగదీశ్వర్ రెడ్డి గ్రామానికి వెళ్లగా మా జీవనాధారం పోతుందని గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వేనంబర్ 67లో కొందరికి పట్టాలు ఉన్నాయని చూపించారు. జాయింట్ సర్వే చేపడతామని అధికారులు చెప్పారు. అంతలోనే రైతు నూకల తిరుపతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో సర్పంచ్ విగ్నేష్ బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజీ పరామర్శించారు. రైతు ఆత్మహత్యాయత్నానికి కారకులైన అటవీ అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


