కమీషన్లకు కక్కుర్తి
కట్టడికి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్న పోలీసులు డబ్బు డిమాండ్ చేస్తే 112కు సమాచారం ఇవ్వాలని సూచన
ఖమ్మం రోటరీ కాలనీలో ఇల్లు నిర్మించుకున్న దంపతులు సంతోషంగా గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ఆ ఇంటికి వచ్చిన ముగ్గురు హిజ్రాలు డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆమె తన వద్ద రూ.5వేలు ఉన్నాయని ఇవ్వబోగా.. రూ.కోటి ఇల్లు కట్టుకున్నందున రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతకూ వినకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తే ఓ కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కానిస్టేబుల్ వారితో మాట్లాడాక ఎంతో కొంత ఇచ్చి పంపించాలని యజమానికి సూచిస్తూ వెళ్లిపోయాడు. చివరకు ఆ ఇల్లాలు రూ.10వేలు ఇస్తే ఆ డబ్బు తీసుకుని కూడా హిజ్రాలు దూషిస్తూ వెళ్లిపోగా ఆమెకు గృహప్రవేశం చేసుకున్న
సంతృప్తికి బదులు కన్నీళ్లు మిగిలాయి.
ఖమ్మం క్రైం: కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షాన శుభకార్యాలు, వివాహాలు చేసుకుంటున్న పలువురికి హిజ్రాల కారణంగా వేదన మిగులుతోంది. ఫంక్షన్ హాళ్లకు గుంపుగా వచ్చి రూ.వేలల్లో డబ్బు డిమాండ్ చేయడం.. యజమానులు యజమానుల స్థోమతకు తగినట్లు ఇస్తే సంతృప్తి చెందకుండా దూషిస్తుండడంతో వారికి ఆవేదన ఎదురవుతోంది. ఇటీవల హిజ్రాల ఆగడాలు మితిమీరుతుండడంతో డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు వారిని కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీపీ సునీల్దత్ స్వయంగా హిజ్రాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సీపీ సూచించగా.. ట్రాన్స్జెండర్ల కదలికలపైనా నిఘా పెట్టాలని నిర్ణయించారు.
జిల్లాలో 100మందికి పైగానే..
జిల్లా వ్యాప్తంగా 100 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉండగా. అందులో సుమారు 40మంది వరకు ఖమ్మంలో, అదీ త్రీటౌన్ ప్రాంతంలో ఉంటున్నారని తెలిసింది. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా తదితర పట్టణాల్లో కదలికలు ఉన్నట్లు గుర్తించారు. కొందరు మాత్రమే పనులు చేసుకుంటూ గౌరవంగా జీవిస్తుండగా మిగతా వారి వసూళ్లకు తెగబడినట్లు తెలుస్తోంది.
డబ్బులు ఇవ్వకపోతే అంతే....
జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాలను సైతం వదలకుండా ట్రాన్స్జెండర్లు గ్రూప్లుగా తయారై వివాహాలు, ఇతర శుభకార్యాల జరిగే వేదికలకు వద్దకు వెళ్లి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కొంత ఇచ్చినా తీసుకోకుండా శాపనార్దాలు పెట్టడం.. అందరి ముందు అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. చివరకు వారు చెప్పినంత మేర డబ్బు ఇచ్చి వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు వచ్చి ఎంతో కొంత ఇచ్చి పంపించాలని సూచిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ పోలీసులు గట్టిగా బెదిరించి పంపించినా.. ఆ తర్వాత మళ్లీ వచ్చి హిజ్రాలు బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు..
కొంతకాలంగా ఖమ్మంకు ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలు వస్తున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా హిజ్రాలపై ఫిర్యాదులు అందుతుండటంతో వారిని కట్టడి చేయడానికి పోలీస్శాఖ సైతం సిద్దం అయింది. వివాహాలు, ఇతర శుభకార్యాల వద్దకు వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టే ట్రాన్స్జెండర్లపై కఠినంగా వ్యవహరించాలని సీపీ ఇటీవల జిల్లా వ్యాప్తంగా అధికారులను ఆదేశించారు. అంతేకాక ఇబ్బందులు ఎదుర్కొనే వారు 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతేకాక సీపీ సైతం ఇప్పటికే ట్రాన్స్జెండర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు చట్టపరమైన చర్యలను వివరించారు.
శుభకార్యాల్లో వంట చేసే వారు, క్యాటరింగ్ వచ్చే వారికి హిజ్రాలు కమీషన్ల ఆశ చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎక్కడ, ఏ సమయానికి, ఏ వేడుక జరుగుతుందో హిజ్రాలకు సమాచారం ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో సరైన సమయానికి వారు బృందంగా చేరుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని.. అందులో కొంత కమిషనర్ సమాచారం ఇచ్చిన వారికి ముట్టచెబుతున్నారని సమాచారం.
జిల్లాలో నానాటికీ పెరుగుతున్న హిజ్రాల ఆగడాలు


