‘ఎస్ఐఆర్’ పరిశీలన
నోటీసులు అందుకున్న వారు విచారణకు రావాలి
జిల్లా పరిశీలకురాలు దేవసేన
ఖమ్మం సహకారనగర్: అర్హత కలిగిన పౌరులందరి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని ఎలక్టోరల్ రోల్ జిల్లా పరిశీలకురాలు ఏ.శ్రీదేవసేన తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆమె ‘ఎస్ఐఆర్’ కార్యక్రమంపై కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆధ్వర్యాన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవసేన మాట్లాడుతూ జిల్లాలో ‘సర్’కు సంబంధించి ఇప్పటివరకు ప్రధాన సమస్యలు గుర్తించలేదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు, ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. వివాహిత మహిళల విషయంలో పేర్ల మార్పులు, అక్షర దోషాలు, ఇతర చిన్నపాటి తప్పిదాలను స్వీయ ప్రకటన ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
17,555మంది విచారణ
కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిలాల్లో ఇప్పటి వరకు 1,36,787మందికి నోటీసులు జారీ చేయగా, 17,555మంది విచారణ పూర్తయిందని తెలిపారు. అయితే, నోటీసులు అందుకున్న ప్రతీ ఒక్కరు విచారణకు హాజరయ్యేలా పార్టీల ప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక ఎన్నికల సంఘం అనుమతించిన ధ్రువపత్రాల వివరాలు వెల్లడించాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫా రంలో వివరాలు ఉన్నప్పటికీ మ్యాపింగ్లో సమస్యలు ఎదురైతే విచారణ సమయంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అందరికీ నోటీసుల జారీ ప్రక్రియ ఐదు రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్ యాదవ్, ఖ మ్మం ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: ‘ఎస్ఐఆర్’లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్ల విచారణను జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవసేన ఖమ్మంలో పరిశీలించారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో విచారణను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు, ఏఈఆర్ఓలు సూచనలు చేయడమే కాక ఓటర్ల సందేహాలను నివృత్తి చేశారు.


