మధిర: మధిర మండలం మాటూరుపేటలో శని వారం మేతకు వెళ్లిన ఐదు గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. గ్రామ రైతులు ధనిశెట్టి భాస్కరరావు, సామినేని శ్రీనివాసరావు, ముది గొండ సీతయ్య, ధనిశెట్టి వెంకటనరసయ్యకు సంబంధించిన నాలుగు పాడి గేదెలు, ముదిగొండ ఈశ్వరరావుకు చెందిన దున్నపోతు మేతకు వెళ్లా యి. అక్కడ తెగిపడిన తీగను తాకడంతో విద్యుత్ ప్రసారం జరిగి మృతి చెందాయి. ఒక్కో గేదె విలువ రూ.1.40 లక్షలు ఉన్నందున, పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి(45) మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోగా, ఆయన అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సీఐ బాలకృష్ణ సూచించారు.
సహజీవనంలో ఘర్షణ.. ఆత్మహత్య
ఖమ్మం అర్బన్: ఖమ్మం యూపీఎస్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న అనుముల కార్తీక్(22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కొన్నాళ్ల నుంచి ఇద్దరు పిల్లల తల్లితో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమాన ఆమె వద్దకు మరో వ్యక్తి వస్తున్నాడనే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సదరు మహిళ పుట్టింటికి వెళ్లిపోగా కార్తీక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఈమేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. కాగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించారు.
చోరీకి వచ్చి మద్యపానం!
● ఫుల్లుగా తాగి మత్తులోకి జారుకున్న ముగ్గురు
ఖమ్మంరూరల్: దాబాలో చోరీ చేసేందుకు వెళ్లిన ముగ్గురు అక్కడ పెద్దమొత్తంలో మద్యం సీసాలు కనిపించేసరికి వచ్చిన పని మరిచిపోయారు. ఫుల్గా మద్యం తాగి మత్తులో జారుకున్న ఘటన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఖమ్మం–కురవి రహదారి సమీపాన రమేష్ దాబాలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ కోసం ముగ్గురు చొరబడ్డారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం కనిపించడంతో అసలు పని పక్కన పెట్టి మద్యం తాగడంలో మునిగిపోయారు. రాత్రంతా మద్యం సేవించాక ముగ్గురూ మత్తులోకి జారుకున్నారు. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దాబా తెరిచేందుకు యజమాని రాగా లోపల కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి విచారించడంతో చోరీ వివరాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కకుండా పారిపోవాల్సిన వారు మద్యం మత్తులో చిక్కడంపై సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు సైటెర్లు వేస్తున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
కామేపల్లి: మండలంలోని ముచ్చర్ల శివారులో టాస్క్ఫోర్స్, కామేపల్లి పోలీసులు శనివారం రాత్రి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఖమ్మంకు చెందిన పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు పట్టుబడగా, మరో ఎనిమిది మంది పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.53,650 నగదు, ఒక కారు స్వాధీనంచేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.


