ఏటా నిర్వహణపై మీనమేషాలే..
మండల, జోన్ స్థాయిలో
తూతూ మంత్రంగా ఎంపికలు
విద్యాశాఖ చొరవ చూపితేనే ఫలితం
ఖమ్మం స్పోర్ట్స్: విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నాయి. అయినా పాఠశాలల క్రీడాపోటీల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ, పాఠశాలల క్రీడా సంఘం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా ఇదే తరహాలో ప్రణాళిక లేకపోవడం, ఆతర్వాత హడావుడిగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తుండడంతో జట్ల ఎంపికల్లో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. క్యాలెండర్ రూపొందించి పోటీలు నిర్వహిస్తేనే అర్హులు, ఔత్సాహిక విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వేధిస్తున్న నిధుల కొరత
ప్రధానంగా పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. క్రీడా నిర్వహకులు ప్రతీ విద్యార్థి నుంచి కనీసం రూ.10 వసూలు చేసినా రూ.లక్షల్లో జమ అవుతాయి. కానీ గత ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచే దాదాపు రూ.10లక్షలకు పైగా వసూలు కావాల్సి ఉండగా ఆ స్థాయిలో రాలేదు. కొన్ని స్కూళ్ల బాధ్యులు ఆలసత్వం వహించగా, ఇంకొందరు పూర్తిగా చెల్లించలేదు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రుసుము వసూలు చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి.
మండల, జోన్ స్థాయిలో పోటీలు తప్పనిసరి
జిల్లా స్థాయి పాఠశాలల క్రీడాపోటీలనుమూడంచెల్లో నిర్వహించాలి. మండల స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించాల్సి ఉన్నా పెద్దగా స్పందన రావడం లేదు. ఆపై కొంతమందిని హడావుడిగా తీసుకొచ్చి, ఆ పోటీలు కాగానే జోన్స్థాయి జట్లను ఎంపిక చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని క్రీడాంశాల్లో నేరుగా జిల్లాస్థాయి ఎంపికకు పంపిస్తుండడం గమనార్హం. భావిస్తున్నారు. జిల్లాస్థాయిలో కనీసం 20 క్రీడాంశాశాల్లో పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేస్తే ఫలితం ఉంటుందని తెలిసినా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల క్రీడాసంఘం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే, క్రీడా సంఘం బాధ్యులు మాత్రం సరైన నిధులు లేక జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కనీసం 30 క్రీడాంశాలకు పైగా అండర్–14, 17 బాలబాలికల జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించాల్సి ఉండడం, క్రీడాకారుల వెంట పీఈటీలు వెళ్లాల్సి రావడం భారం మారుతున్నందున ముందుగా నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.


