తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలు లో జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన చెన్న సుగుణ గత నెల 17న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, ఆభరణాల చోరీ కోసం వచ్చిన వారితో కారం, కత్తిపీటతో ప్రతిఘటించింది. దీంతో అదే కత్తిపీటతో ఆమె తలపై తీవ్రంగా కొట్టగా మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు పోలీసులు గ్రామాన్ని జల్లెడ పట్టి అనుమానితులను విచారించడంతో పాటు పలువురి కాల్డేటాను పరిశీలించారు. ఈ క్రమాన వృద్ధురాలి ఇంటి సమీపాన చికెన్షాపు నిర్వహిస్తున్న ఓ యువకుడి కదలికలపై నిఘా వేసి ఆయన ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలించడంతో నిందితుడిగా తేలినట్లు సమాచారం. ఆయన తన సమీప బంధువు ద్వారా పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసినట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆ యువకుడి సోదరుడు, సమీప బంధువును కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న నగదు లావాదేవీల ఆధారంగా పోలీసులు కేసు చేధించినట్లు తెలుస్తుండగా, హత్యకు ఉపయోగించిన వస్తువులు, బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాక ఇదే గ్రామంలో జరిగిన ఇంకొన్ని ఘటనల్లో నిందితుల పాత్ర ఉందా అని విచారిస్తున్నట్లు సమాచారం.
కాల్డేటా, లావాదేవీల ఆధారంగా గుర్తింపు


