కొణిజర్ల: గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాకపోగా ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలులో వేయిస్తానని బెదిరించడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని తనికెళ్లకు చెందిన పెద్దగౌండ్ల గోపాల్రావు అలియాస్ గోపి(27)కు గతంలోనే వివాహం జరిగినా విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఆయన చింతకాని మండలం నేరడకు చెందిన రజనిని వివాహం చేసుకోగా దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా పెద్దలు నచ్చజెప్పినా మార్పు రాలేదు. ఈ క్రమాన 15 రోజుల క్రితం రజని పుట్టింటికి వెళ్లింది. గోపి ఫోన్ చేయగా మరోమారు ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో గోపి రోజులాగే శుక్రవారం ఆటో నడిపిన అనంతరం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం స్థానికులు ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఘటనపై ఆయన తల్లి శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, గోపి చేతిపై ‘నా చావుకు కారణం భార్య రజని, మామ మట్టా సీతారాములు’అని రాసుకున్నాడని తెలిపారు.
ఆందోళనతో యువకుడి ఆత్మహత్య


