జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం
వరి సాగుపై రైతుల్లో ఆశలు
ఖమ్మంవ్యవసాయం: అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం భారీ వర్షం, ఇంకొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయానికి ఏన్కూరులో 23.3 మి.మీ.లు, ముదిగొండలో 18.3, పల్లెగూడెంలో 13.5, గేటుకారేపల్లిలో 13.3, ఖమ్మం ఖానాపురంలో 10.8, ప్రకాష్నగర్ 9.5, చింతకానిలో 8.8, రఘునాథపాలెంలో 8.5, కలక్టరేట్ వద్ద 7.5, కూసుమంచిలో 6.5, నాగులవంచ, వైరాలో 5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తిమ్మారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, పెద్దగోపతి, తిమ్మారావుపేట, కామేపల్లి, కొణిజర్ల, కల్లూరు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురవగా, మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
పైర్లకు ప్రయోజనకరం
ప్రస్తుతం కురుస్తున్న వానలు సాగులో ఉన్న పైర్లకు ప్రయోజనం కలిగిస్తున్నాయి. జూన్లో వర్షాలు మొదలుకాగానే రైతులు విస్తారంగా పత్తి సాగు చేశారు. ఆతర్వాత వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై నీలినీడలు కమ్ముకోగా అధిక నీరు అవసరమయ్యే వరి సాగు జోరందుకోలేదు. ప్రభుత్వం, అధికారుల సూచనలతో పలువురు వరి మాగాణి భూముల్లో పెసరతో పాటు కంది, మినుము, వేరుశనగ, చెరకు సాగు చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలు కొనసాగితే వరి సాగు చేయాలనే ఆశతో అన్నదాతలు ఉన్నారు. నాగార్జునసాగర్లోకి నీరు చేరితే ఆలస్యంగానైనా నాట్లు వేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 1.10 లక్షల ఎకరాల్లో పలు పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు.


