● రూ.2.25 లక్షలు అందించిన
పూర్వ విద్యార్థులు
నేలకొండపల్లి/ఏన్కూరు: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంనకు చెందిన తాళ్లూరి గురుబ్రహ్మాచారికి ఆయన మిత్రులు అండగా నిలిచారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆయనతో కలిసి ఏన్కూరు గురుకులంలో చదువుకున్న 1992 బ్యాచ్ మిత్రులు.. రూ.2.25 లక్షలు సేకరించి స్నేహితుల దినోత్సవమైన ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో అర్పినేని కృష్ణ, తిరునగిరి అనిల్, వంగూరి మల్లేశ్, పగిడిపల్లి పుల్లయ్య, చిప్పలపల్లి వెంకన్న, వేల్పుల సురేశ్బాబు, గుడిపూడి కృష్ణయ్య, బండి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు
ఖమ్మంసహకారనగర్: విద్యారంగంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా 20 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, నోటు పుస్తకాలు అందలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న కిట్, రెండు జతల యూనిఫామ్ ఈ నెల 15 నాటికై నా అందేలా చూడాలన్నారు. అలాగే, మధ్యాహ్న భోజన ఏజెన్సీల వేతనాలు పెంచి కోడిగుడ్లు సరిగ్గా పంపిణీ చేయించాలని కోరారు. అంతేకాక సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేలా సర్దుబాటు చేయాలని, ఖమ్మంలోని కొత్త కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు రంజాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, బానోతు రాందాస్, పినపాక సురేశ్, షేక్ ఉద్దండ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల కోలాహలం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 679 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.32,380, సఫారీ వాహనాల ద్వారా రూ.10,250 లభించించినట్లు వైల్డ్లైఫ్ అధికారులు తెలిపారు. 360 మంది బోటింగ్ చేయగా రూ.22,400 ఆదాయం టూరిజం శాఖకు ఆదాయం లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.


