‘సర్’లో సత్తుపల్లి మండలం ఫస్ట్!
● గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ప్రతీ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని గడువులోగా సమర్పించేలా రాజకీయ పార్టీల నాయకులు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి శుక్రవారం ఆయన కలెక్టరేట్లో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 31,967 మంది మృతి చెందిన ఓటర్లు, 10,060 డబుల్ ఎంట్రీలు, 94 వేల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ఇంకా 31 వేల మంది ఓటర్లు స్పందించకపోగా, వీరిలో ఎక్కువగా ఖమ్మం నగరవాసులే ఉన్నారని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటర్ల పేరు ముసాయిదా జాబితాలో ఉండదని, తద్వారా ధ్రువపత్రాలతో ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, 42 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ కాకపోవడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 గుర్తింపు పత్రాల్లో ఒకటి ఇచ్చేలా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఈవిషయమై ఓటర్లకు నాయకులకు అవగాహన కల్పించాలని సూచించారు.
677 కేంద్రాల్లో పూర్తి
జిల్లాలోని 1,460 పోలింగ్ కేంద్రాలకు గాను 677 కేంద్రాల్లో 100 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. మరో 544 కేంద్రాల్లో 95 శాతం, 158 కేంద్రాల్లో 90 శాతం పూర్తయిందని చెప్పారు. పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్ఏలు) క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓలు)కు సహకరిస్తూ ఓటర్లు సరైన వివరాలతో ఫారం ఇచ్చేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్, డీఆర్వో సీ.హెచ్.రామమూర్తి, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సత్తుపల్లిటౌన్: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) వంద శాతం పూర్తి చేసిన మండలంగా సత్తుపల్లి నిలిచింది. మండలంలో వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ శుక్రవారంతో పూర్తయింది. మండలంలో 76 పోలింగ్ కేంద్రాలకు గాను 65,488 మంది ఓటర్లు ఉఉండగా.. మృతులు, శాశ్వత చిరునామా మారిన వారు, రెండేసి చోట్ల ఓట్లు కలిగిన 7,500 మందిని మినహాయించి మిగతా నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించడమేకాక డిజిటలైజేషన్ చేశామని తహసీల్దార్ పున్నం సత్యనారాయణ తెలిపారు. ఇందుకు సహకరించిన ఏఎల్ఎంటీ మధు, ఉద్యోగులకు అభినందించారు.


