
ఇళ్ల కోసం లొల్లి..
ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, నిలదీతల పర్వం కొనసాగుతోంది. అన్ని అర్హతలు ఉన్నా.. జాబితాలో తమకు ఎందుకు స్థానం దక్కలేదని పంచాయతీ కార్యదర్శులతో పాటు సర్వేకు వచ్చిన అధికారులను నిలదీస్తున్నారు. అంతేకాక అనర్హులకు చోటు కల్పించారని ఇందిరమ్మ కమిటీ సభ్యులపై మండిపడుతున్నారు. ఈక్రమంలో మండల, జిల్లాస్థాయిలో ప్రజావాణికి సైతం ఫిర్యాదులు అందుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
‘ఇందిరమ్మ’ జాబితాపై మిన్నంటుతున్న నిరసనలు
● అర్హులకు స్థానం దక్కలేదని ఆగ్రహం ● జిల్లాలోని పలు గ్రామాల్లో వరుస ఆందోళనలు
మూడు కేటగిరీల్లో ఎంపిక
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికను మూడు కేట గిరీల్లో నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సొంత స్థలం ఉండి.. గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండే వారిని ఎల్–1 కేటగిరీగా, గుడిసెలు, రేకులషెడ్లు, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లల్లో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2గా, ఇళ్లు ఉండి, తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న సంతానాన్ని ఎల్–3 కేటగిరీలో చేర్చారు. ఈ జాబితా ఆధారంగా అర్హులను ఎంపిక చేసి కలెక్టర్కు ఇస్తుండగా.. ఆపై ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి పరిశీలించాక ఖరారు చేస్తారు. తొలుత ఎల్–1 కేటగిరీకి ప్రాధాన్యత ఇస్తామని ముందుగా వెల్లడించారు.
జాబితాలో పేర్లు లేకపోవడంతో..
మూడు కేటగిరీలతోపాటు కొత్తగా అందిన దరఖా స్తులు కలిపి జిల్లాలో 70,167మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే, తాజాగా విడుదల చేసిన జాబితాల్లో పేర్లు లేకపోవడంతో ఇళ్ల కోసం గంపెడాశలు పెట్టుకున్న నిరుపేదలకు ఆగ్రహం కలిగి స్తోంది. దశాబ్దాలుగా సొంత ఇల్లు లేక, కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న తమకు అన్యా యం జరిగిందని వాపోతున్నారు. ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారు, గతంలోనే ఇళ్లు ఉన్న వారిని ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టం వచ్చిన వారికే కేటాయించారని ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్బంధం, నిలదీతలు..
లబ్ధిదారుల ఎంపికకు కేటగిరీలుగా విభజించి సర్వే చేస్తుండగా.. జాబితాలో ఎక్కువగా అనర్హులే ఉన్నారని నిరసనలు వ్యక్తవుతున్నాయి. జాబితా పరిశీలనకు వచ్చే అధికారులను నిలదీస్తూనే.. జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులకు ఇదే విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇతర పార్టీల నేతల వద్దా ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు. మండల, జిల్లాస్థాయి గ్రీవెన్స్లో సైతం అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లపైనే ఫిర్యాదులు వస్తున్నాయి.
అధికారుల అడ్డగింత
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులకు స్థానం కల్పించారంటూ తల్లాడ మండలం అన్నారుగూడెం వాసులు అధికారులను గురువారం నిలదీశారు. గ్రామానికి 40ఇళ్లు మంజూరైతే, జాబితాలో అందరూ అనర్హులే ఉన్నారని ఇటీవల సత్తుపల్లి ఎమ్మెల్యే, ఆర్డీఓకు 18 మంది ఫిర్యాదు చేశారు. దీంతో వారి సూచనల మేరకు ఎంపీడీఓ సురేష్బాబు, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు విచారణ కోసం గురువారం గ్రామానికి వస్తుండగా కాలనీ ప్రారంభంలోనే దళిత కాలనీ మహిళలు కారును అడ్డుకున్నారు. అయితే, విచారణ కోసమే వస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లు అందుతాయని చెప్పడంతో మహిళలు అడ్డు తొలిగారు.