మధిరకు త్వరలో ఐటీ హబ్‌.. | - | Sakshi
Sakshi News home page

మధిరకు త్వరలో ఐటీ హబ్‌

Jul 2 2024 12:58 AM | Updated on Jul 2 2024 11:51 AM

మధిరకు త్వరలో ఐటీ హబ్‌

మధిరకు త్వరలో ఐటీ హబ్‌

పట్టణంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం: మధిర నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

సోమవారం మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మధిరకు త్వరలో ఐటీ హబ్‌ తీసుకొస్తామని చెప్పారు. మండలంలోని యండపల్లి గుట్ట వద్ద ఎంఎస్‌ఎమ్‌ఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపన చేస్తానని వెల్లడించారు.

మధిరలోని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకే ఈ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎంఈ పరిశ్రమలు పెట్టుకునే యువతకు ప్రభుత్వం నుంచి అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. ట్రెడిషనల్‌ వ్యాపారాన్ని పారిశ్రామికీకరణ చేసి ఉత్పత్తి, వినియోగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇందిరా డెయిరీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. స్థానికుల అభిప్రాయం మేరకే పట్టణంలో రహదారుల విస్తరణ కార్యక్రమం ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement