హొసపేటె: గౌరీ గణేష్ ఉత్సవాన్ని శాంతి సామరస్యంతో ఉత్సాహంగా జరుపుకోవాలని విజయనగర జిల్లా ఎస్పీ ఎస్.జాహ్నవి సూచించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని జిల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన గౌరీ గణేష్ ఉత్సవ శాంతి సమావేశానికి అధ్యక్షత వహించి ఆమె మాట్లాడారు. ఉత్సవ సమయంలో ఏదైనా విపత్తు సంభవిస్తే సంబంధిత ఉత్సవ కమిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్, హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, మున్సిపల్ కమిషనర్ శివకుమార్, పీ.వెంకటేష్, దాదా ఖలందర్, గుజ్జల గణేష్, జగదీష్ కమతగి తదితరులు పాల్గొన్నారు.
చాకులతో వీరంగం.. ఇద్దరిపై కేసు
హుబ్లీ: హుబ్లీ రైల్వే స్టేషన్ మూడో గేట్ వద్ద ఒక చాకు, మరో చేతిలో వేళ్లకు వేసుకొనే పిడి ఉన్న చాకులను పట్టుకొని తిరుగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మంటూరు రోడ్డుకు చెందిన శానవాజ్ బేపారి, అస్లాం బేపారిలను హ్యాట్స్టబ్బింగ్ స్య్వాడ్ తనిఖీ చేసి ఆయుధాలు ఉన్నట్లు కనుగొంది. ఘటనపై హుబ్లీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మార్కెట్లో లంబోదరుని విగ్రహాలు సిద్ధం
హొసపేటె: వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి వేడుకకు ఒక రోజే సమయం ఉండటంతో మార్కెట్లకు పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. గతంతో పోల్చితే పూజా సామగ్రి ధరలు మరింత పెరిగాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గణేశుని మట్టి విగ్రహాలు సైజును బట్టి రూ.200 నుంచి రూ.2000 మధ్య ధరల్లో అమ్ముతున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కొనుగోళ్లు పెరగడంతో వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, పండ్లు, పూల వ్యాపారుల్లో సంతోషం నిండింది.
కోట్లలో లాభాలంటూ లక్షల్లో వంచన
హుబ్లీ: ఫేస్బుక్ ట్రేడింగ్ వాణిజ్య ప్రకటన చూసి పెట్టుబడి పెట్టిన నగర వ్యక్తిని ఏకంగా రూ.33.75 లక్షల మేర వంచించారు. పునీత్ మోసపోయిన వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తులు కే03 మార్కెట్ ట్రెండ్స్ కమ్యూనిటీ అనే వాట్సప్ గ్రూప్లో చేర్పించారు. ఆ తర్వాత షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. వారి మాటలను నమ్మిన పునీత్ ముందుగా రూ.10 వేలను పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో ఎక్సీవెస్ట్ యాప్లో రూ.2.57 కోట్ల లాభం చూపించారు. దీన్ని విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా డబ్బులు అసలు జమ కాలేదని తేలింది. దీంతో మెసేజ్ చేసి విచారించగా ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టాలని నమ్మబలికారు. ఆ మేరకు రూ.33.75 లక్షలను విడతల వారీగా తన ఖాతా నుంచి ఆన్లైన్ వంచకులు బదలాయించుకొని మోసగించినట్లు పునీత్ హుబ్లీ ధార్వాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జోనల్ క్రీడా పోటీల్లో సత్తా
హొసపేటె: జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో టీబీ డ్యాం పీఎల్సీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కేజీఎస్ క్లస్టర్ జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి యోగా, 100, 600 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో, కబడ్డీ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి షీల్డ్, ప్రశంసా పత్రాలను సాధించారు. హెచ్ఎం లలితమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, హేమలత, నిర్మల, రవి, ఈరప్ప మంజుల, శారద తదితరులు పాల్గొన్నారు.
ధార్వాడ విద్యాకాశీ
ఘనత సిద్దప్పదే
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర జిల్లా కాంగ్రెస్ సమితి ఆధ్వర్యంలో విద్యానిపుణులు సర్ సిద్దప్ప కంబళ్లి 145వ జయంతిని ఘనంగా జరిపారు. సమితికి నూతన అధ్యక్షుడు సదానంద డంగనవర మాట్లాడుతూ ధార్వాడ కర్ణాటక విశ్వవిద్యాలయం స్థాపనకు సిద్దప్ప మూలప్రేరణ ఇచ్చారన్నారు. డాక్టర్ అంబేడ్కర్ అన్ని విధాలుగా ఆయనకు సహకారం అందించారన్నారు. సర్ సిద్దప్ప ముంబై సర్కారులో విద్య కోసం కర్ణాటక వాటాను కచ్చితంగా ఇవ్వాలని గళమెత్తారని ఎమ్మెల్సీ జక్కప్పనవర తెలిపారు. ప్రముఖులు అల్తాఫ్ హుస్సేన్, రాజశేఖర్, గంగాధర, రఫీక్, కిషోర్, గణేష్ పాల్గొన్నారు.


