హుబ్లీ: పనికి వెళ్లకుండా తప్పించుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) పరిజ్ఞానంతో ఓ యువకుడు సృష్టించిన నకిలీ పులి వీడియో వైరల్గా మారింది. వివరాలు ఇలా.. కొప్పళ తాలూకా కవళి గ్రామం ఈరణ్ణ అనే యువకుడు తోటలోకి పనికి వెళ్లకుండా ప్లాన్ వేశాడు. పని నుంచి తప్పించుకునేందుకు తోటలోకి పులి వచ్చినట్లుగా ఏఐతో వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. వీడియోను పరిశీలన చేయగా ఇది ఏఐ పని అని తెలుసుకున్నారు. అసత్యాన్ని సత్యంగా వైరల్ చేసి భయాందోళనకు గురి చేసినందుకు ఆ యువకుడిని అధికారులు మందలించారు. 50 బస్కిలు చేయమని శిక్ష విధించి హెచ్చరించి పంపించేశారు.


