రాయచూరు రూరల్: సిరవార తాలూకా హోక్రాని గ్రామంలో మలవిసర్జనకు వెళ్లిన అశ్విని అనే యువతిపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. సంచాలకుడు సణ్ణ బాబు మాట్లాడుతూ.. పోలీసులు ఈ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అశ్విని మృతదేహాన్ని బావిలో పడేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై దాడులు పెరిగి పోతున్నాయన్నారు.
బెదిరిన ఎద్దులు.. రైతు మృతి
రాయచూరు రూరల్: సింధనూరు తాలూకా బెళగుర్కి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎద్దులు బెదిరి యమునప్ప (60) అనే వృద్ధ రైతును రెండు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా.. ఆదివారం యమునప్ప పొలంలో సేద్యం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ఒక్కసారిగా ఎద్దులు బెదిరిపోయాయి. ఎడ్లకు కట్టిన తాడు యమునప్ప కాలికి చుట్టుకుంది. ఎద్దులు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రైతును ఈడుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
నోట్ పుస్తకాల వితరణ
రాయచూరు రూరల్: పేద విద్యార్థుల చదువుకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని డాక్టర్ సందీ్ప్ పాటిల్ సూచించారు. రాయచూర్ తాలుకా శ్రీరామ నగర్ క్యాంప్, పత్తేపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేశారు. మంచుకొండ కృష్ణాజీ చారిటబుల్ ఆధ్వర్యంలో తాలుకాలోని 40 పాఠశాలల పేద విద్యార్థులకు ఉచితంగా 5 వేల నోట్ పుస్తకాలు అందజేయనున్నారు. కార్యక్రమంలో నందీష్, మహంతేష్ బిరదార్, శ్రీకాంత్, మారుతి, మారెప్ప, వీరేష్, భీమానాయక్, గీతారాణి, విద్యావతి, ధనలక్ష్మి, సంతోష్ శాహిన్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
ఉచిత క్యాన్సర్ చికిత్స శిబిరం
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్ సూచించారు. ఆదివారం నగరంలోని కన్నడ భవనంలో విజయ కర్ణాటక, స్పర్శ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 350 మందికి ఉచితంగా క్యాన్సర్ చికిత్సలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి నందిత, నగరసభ కమిషనర్ విజయ రాణి, మంజునాథ్ శాలి తదితరులు పాల్గొన్నారు.
నగరాభివృద్ధికి ప్రాధాన్యత
హొసపేటె: నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని హొసపేటె శాసన సభ్యుడు హెచ్.అర్.గవియప్ప సూచించారు. ఆదివారం నగరంలోని బాలాజీ నగర్ పార్క్లో అమృత నగర్ ప్రాజెక్టు కింద రూ.10 లక్షలతో నీటి ట్యాంక్, జంబునాథన హళ్లిలో బాలికల హస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వసతి నిలయాలను ఏర్పాటు చేశామన్నారు. హొసపేటెను విద్యా హబ్గా మార్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారి మనోహర్, హుడా అధ్యక్షుడు ఇమామ్ నయాజ్, నగర సభ అధ్యక్షుడు రూపేష్ కుమార్, కమిషనర్ శివ కుమార్, నేతలు రవి కుమార్ పాల్గొన్నారు.


