సాక్షి, బళ్లారి: ఎం.గోవర్దన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలతో తమ భూములను బదలాయించుకున్నాడని చరకుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చరకుంట గ్రామానికి చెందిన 13 మంది బాధిత రైతులు నగరంలోని పత్రికా భవన్లో విలేకరులతో మాట్లాడారు. గోవర్దన్ అతని అనుచరులు తమ భూములను స్వాధీనం చేసుకుని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. 1983లో సంజీవరాయన కోటె గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వ నంబర్ 46లో 15.50 ఎకరాల భూమిని ఎస్టీ, ఇతర వర్గాలకు చెందిన 13 మందికి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అప్పటి నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గోవర్దన్ అనే వ్యక్తి తమ భూములను నకిలీ పత్రాలు ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృిష్టించి జిల్లా కోర్టులో దావా వేశారన్నారు. భూముల్లో పంటలు వేసుకుంటే నాశనం చేసి దాడి చేస్తున్నారని తెలిపారు.


