బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు రోడ్డులోని సుబ్బారావు క్యాంప్లో వెలసిన శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ 5వ రథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు, వివిధ ధార్మిక కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాయంత్రం ఆలయం నుంచి కళా బృందాలతో రథోత్సవాన్ని స్థానిక ఎదురు బసవన్న ఆలయం వరకు లాగారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
చిన్నారిని చిదిమేసిన
స్కూల్ వాహనం
హుబ్లీ: స్కూల్ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన వాహనం దూసుకెళ్లడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా అళ్నావర తాలూకా ఉల్లికేరి గ్రామంలో చోటు చేసుకుంది. మృత చిన్నారిని ఉల్లికేరి గ్రామ నివాసి ల్కుమాన్ బేగూరుగా గుర్తించారు. మంగళవారం స్కూలు పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన స్కూల్ వాహనం ఉల్లికేరి గ్రామంలో ఉన్న వేళ రోడ్డు పక్కన నిలబడిన చిన్నారి ల్కుమాన్పైకి దూసుకెళ్లింది. ఫలితంగా చిన్నారి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
హుబ్లీ: స్థానిక అల్తాఫ్ ప్లాట్లో ఇంటి ముందు ఆటలాడుతున్న మూడేళ్ల బాలుడు అజాన్పై నాలుగైదు వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుబ్లీ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో లక్ష్మి పూజలు
రాయచూరు రూరల్: ఆషాఢ మాసం చివరి రోజున గౌళి సమాజం ఆధ్వర్యంలో లక్ష్మి పూజలను నెరవేర్చారు. మంగళవారం ఎల్వీడీ కళాశాల వద్ద వెలసిన లక్ష్మిదేవి ఆలయంలో 75వ అమృత మహోత్సవ జాతర సందర్భంగా కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి వీరశివాచార్య ప్రత్యేక పూజలు చేపట్టారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతిలను నెరవేర్చారు. కార్యక్రమంలో విశ్వనాథ్, లక్ష్మణ్, ఈరేశ్, రాము, శాంతప్ప, ఆంజనేయలున్నారు.
ఆరోగ్య రంగానికి పెద్దపీట
రాయచూరు రూరల్: ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత కల్పించాలని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. ట్రామా కేర్ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా చేపట్టాలని సూచించారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలన్నారు. తాలూకాలోని ఆర్హెచ్ క్యాంప్లో తాగునీటి ఎద్దడి నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు. క్యాంప్ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి మంగళవారం తాగునీటి ట్యాంకులను ప్రారంభించి నీటి సౌకర్యం కల్పించారు.
మొబైల్స్ అతిగా
వినియోగిస్తే అనర్థాలు
కోలారు: మొబైల్స్ అతిగా వినియోగిస్తే అనర్థాలు చోటుచేసుకుంటాయి. పిల్లలను మొబైల్స్కు దూరంగా ఉంచాలని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జయశ్రీ తెలిపారు. మంగళవారం నగరంలోని పాల సంద్ర లేఅవుట్లో జిల్లా న్యాయవాదుల సంఘం, నలంద విద్యా నికేతన్ ఆధ్వర్యంలో న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మౌలిక హక్కులు, కర్తవ్యాలు, పోక్సో చట్టాలు, గృహ హింస చట్టంపై అవగాహన కల్పించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అవుతుండటం విచారకరమన్నారు. నేడు చిన్న వయసులోనే పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సభ్యుడు, సివిల్ న్యాయమూర్తి నీలాచారి బడిగేర, నలంద విద్యా నికేతన్ కార్యదర్శి టీ.ఆర్.జయరాం తదితరులు పాల్గొన్నారు.


