అగళి: మండలంలోని అలూడి గ్రామంలో వెలసిన కరియమ్మ దేవికి మంగళవారం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జ్యోతుల ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు జ్యోతులను ఊరేగింపుగా తీసుకెళ్లి కరియమ్మదేవి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కరియమ్మదేవిని ప్రార్థించారు. అర్చకులు భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు.
ఘనంగా మారెమ్మ దేవతకు
జ్యోతుల ఉత్సవాలు
అగళిలో వెలసిన మారెమ్మ దేవతకు మంగళవారం అగళి, ఎంఎం పాళ్యం, రామాపురం గ్రామాల ప్రజలు జ్యోతుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉపవాసదీక్షతో మహిళలు జ్యోతులను తలపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మడకశిర : పట్టణంలో మంగళవారం గ్రామ దేవతలు ఊరు మారెమ్మ, ముత్యాలమ్మ, ఉడుసలమ్మ, తుమ్మల మారమ్మ, కొల్లాపురమ్మ, గంగ పూజ, దండి మారమ్మ, మూలకంఠేశ్వరమ్మ, కన్యకా పరమేశ్వరి తదితర గ్రామ దేవతలకు జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప, ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్ రెడ్డి తదితరులు అమ్మవార్లకు పూజలు జరిపారు. రైతు విభాగం, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు రామిరెడ్డి, నాగభూషణరెడ్డి, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, ఎస్సీ సెల్ కార్యదర్శి తిప్పేస్వామి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రంగనాథ్, సోషల్ మీడియా విభాగం ఉపాధ్యక్షుడు నగేష్, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు ధను, పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు రఘునందన్, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ స్వామి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు హరీష్ పాల్గొన్నారు.
గుడిబండ: కొంకల్లు గ్రామంలో మంగళవారం గ్రామదేవత మారెమ్మ దేవికి జ్యోతుల ఉత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి పలు రకాల పూజలు చేపట్టారు. అనంతరం మహిళలు గ్రామ పురవీధుల్లో జ్యోతులతో ఊరేగింపుగా వచ్చి మారెమ్మదేవికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అలూడిలో జ్యోతుల ఉత్సవాలు నిర్వహిస్తున్న దృశ్యం
మడకశిరలో అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్న ఈరలక్కప్ప


