చెళ్లకెర రూరల్: మానవ సేవకు స్వయం సేవకులు సిద్ధంగా ఉండాలని భారతీయ రెడ్ క్రాస్ సంస్థ చెళ్లకెర శాఖ చైర్మన్ హెచ్.తిప్పేస్వామి తెలిపారు. శుక్రవారం నగరంలోని తాలూకా కార్యాలయంలో భారతీయ రెడ్ క్రాస్ సంస్థ తాలూకా శాఖను ప్రారంభించి మాట్లాడారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం, మానవీయ సేవలు అత్యవసరం అన్నారు. ఇలాంటి సందర్భాల్లో భారతీయ రెడ్ క్రాస్ సభ్యులు సైనికుల మాదిరిగా సమాజ సేవకు సిద్ధగా ఉండాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో రక్త కొరత ఏర్పడినప్పుడు చాలా మంది స్వయం సేవకులు ప్రాణాలు కాపాడారన్నారు. 40 సంవత్సరాల వ్యక్తి ఇప్పటికే 47 సార్లు రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సంస్థ అధ్యక్షుడు తహసీల్దార్ రెహన్పాషా మాట్లాడుతూ.. భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఎటువంటి జాతి, ధర్మం రాజకీయాలకు సంబంధం లేకుండా సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళలకు వంట సామాగ్రి కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేసీ వీరేష్, డీ.శివప్రసాద్, డీకే.రవి కుమార్, ఎంఎన్ మృత్యుంజయ, రామాంజినేయ, మారుతి పాల్గొన్నారు.


