రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ పథకంలో మురికివాడల ప్రజలకు నిధులు మంజూరు చేయాలని మురికివాడల నిర్మూలన వేదిక డిమాండ్ చేసింది. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు జనార్దన్ మాట్లాడారు. వీధి వ్యాపారస్తులు, కుష్టురోగులు, దివ్యాంగులు, సఫాయి కర్మచారులు, దేవదాసి మహిళలు, వితంతు పేదలు ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ప్రాథమిక విద్య పునాది కావాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్య గట్టి పునాది కావాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఎల్వీడీ కళాశాలలో ఏర్పాటు చేసిన సంగమ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పిల్లలు విద్యతో పాటు కళలు, సాహిత్యం, క్రీడల్లో రాణించడంలో ఉపాద్యాయిల పాత్ర మహోన్నతమన్నారు. భవ్య భారత నిర్మాతలుగా రూపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమావేశంలో టాగూర్ స్మారక విద్యా సంస్థ అధ్యక్షుడు పారసమల్ సుఖాణి, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, చెన్న మల్లికార్జున, వీర హనుమాన్లున్నారు.
యాప్ లోపాలను సరి చేయండి
రాయచూరు రూరల్: అక్షర దాసోహ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో్ల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కేటాయించిన యాప్ల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, లోపాలను సవరించాలని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు గూళప్ప మాట్లాడారు. పాఠశాలల్లో అక్షర దాసోహతో పాటు విద్యార్థుల హాజరు శాతం విషయంలో యాప్ వల్ల పలు ఇబ్బందులు కలగడంతో పాటు హెచ్ఎం, ఉపాధ్యాయులకు సమస్యలు తలెత్తాయని, యాప్ల్లో ఉన్న లోపాలను సవరించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జునకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో వెంకటేష్, ఆంజనేయ, దేవేంద్రప్ప, రావుత్రావ్, మూర్తిలున్నారు.
ఇనుప వంతెనకు మరమ్మతులు
రాయచూరు రూరల్: రాయచూరు– మంత్రాలయం మార్గ మధ్యంలో 2012లో నిర్మించిన స్టీల్ వంతెనపై ఉన్న చువ్వలు తెగిన ఘటన సోమవారం జరిగింది. ఏడాది క్రితం స్టీల్ వంతెనపై స్క్రూలు విరిగి పోతున్న అంశాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురించిన విషయం తెలిసిందే. 2009లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా వంతెన పూర్తిగా కూలి పోయింది. సోమవారం ఉదయం వంతెన మీద ఉన్న ఇనుప చువ్వలు విరిగి పోవడంతో అధికారులు వాటికి మరమ్మతు పనులు చేశారు. మూడు గంటల పాటు రహదారిని బంద్ చేసి మరమ్మతు పనులు ముగించారు.
ప్రత్యేక సవరణలో
అందరూ పాల్గొనాలి
బళ్లారిఅర్బన్: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవాలని మాజీ మేయర్, కార్పొరేటర్ ఎం.రాజేశ్వరి కోరారు. సోమవారం ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సహాయ కేంద్రాన్ని సందర్శించిన ఆమె బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) అందించే ఫారాలను సక్రమంగా నింపి సమర్పించాలని సూచించారు. ఓటు హక్కు రాజ్యాంగ బద్ధమైనది కావడంతో ప్రతి పౌరుడు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


