హొసపేటె: నగరంలోని కోర్టు ఆవరణ వద్ద భిక్షాటన చేస్తున్న 16 ఏళ్ల బాలికను, నాలుగేళ్ల వయస్సుగల బాలుడికి జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు గురువారం విముక్తి కల్గించారు. వారు భిక్షాటనలో నిమగ్నమై ఉండటాన్ని గమనించిన జిల్లా బాలల సంరక్షణ విభాగం న్యాయ పర్యవేక్షణ అధికారి శ్రీకాంత్, వారి సిబ్బంది, పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్కు సమాచారం అందించగా, పోలీసు అధికారుల సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను రక్షించారు. వారిని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, బాలల సహాయవాణి జిల్లా సమన్వయకర్త, కౌన్సిలర్లు విచారణ నిమిత్తం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. విచారణలో ఆ బాలిక హగరిబొమ్మనహళ్లికి చెందినదని, 7వ తరగతి వరకు చదివిందని తెలిసింది. ఆమె విద్య నేపథ్యం గురించి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించగా, ఆ బాలిక గత విద్యా సంవత్సరంలో క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైనట్లు నిర్ధారణ అయింది. అనంతరం బాలికను, బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో జిల్లా బాలల హెల్ప్లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ చిదానంద, సలహాదారు నేత్రావతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


