రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వైద్యరంగం ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి, నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించి ఆయన మాట్లాడారు. కోవిడ్– 2019లో ఎవరూ చేయని సాహసాలను నర్సులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలకు మహర్షి వర్సిటీ మారుపేరన్నారు. పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు ప్రామాణికంగా పేద ప్రజల సేవకు అంకితం కావాలన్నారు. చదివిన చదువుతో పేదలకు, సమాజానికి, కళాశాలకు సేవ చేసి మంచి పేరు తేవాలన్నారు. కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మహాలింగ, రాజ కుమారి, శశికళ, నరసణ్ణ, అలీస్ జోసెఫ్, రాజేశ్వరి, విజయరాజేంద్ర, వందన, సుమలత, రాజశేఖర్, బసవ రాజేశ్వరిలున్నారు.


