బొగ్గు చోరీ బాధ్యులపై క్రిమినల్ కేసు వేయాలి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు అక్రమంగా చౌర్యం అవుతోందని, అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, అలాంటి అధికారులపై క్రిమినల్ కేసు వేయాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం వైటీపీఎస్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నరసింహలు మాట్లాడారు. రాయచూరు, యరమరస్ వరకు రైల్వే లైన్లలో వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్ లోడ్ చేసి కొద్ది మేర ఉంచుకొన్న బొగ్గును రైల్వే స్టేషన్లో నిలిపి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు, సబ్ కాంట్రాక్టర్, మేనేజర్, స్టేషన్ మాస్టర్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రెజెస్లు ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించిన వారిపై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు.
లాభాల ఆశ చూపి
లక్షల్లో టోకరా
హుబ్లీ: దావణగెరె వినాయక లేఅవుట్కు చెందిన ఓ వ్యక్తిని సైబర్ వంచకులు నిట్టనిలువునా దోచుకున్నారు. సుమారు రూ.76.48 లక్షలు ఎగనామం పెట్టారు. వివరాలు.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే బాగా లాభాలు వస్తాయంటూ ఆశ చూపించిన వంచకులు ఫేస్బుక్లో పరిచయం అయిన సదరు వ్యక్తి నుంచి ఆ మేరకు ఆన్లైన్ ద్వారా డబ్బులు దోచుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు సుమారు విడతల వారీగా వివిధ బ్యాంకుల నుంచి డబ్బులను తమ ఖాతాల్లోకి వేయించుకొని వంచించారని బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
రాయచూరు రూరల్: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని దేవదుర్గ తాలూకా నగరగుండ వద్ద జరిగింది. సోమవారం రాత్రి రాయచూరు తాలూకా అరిషిణిగికి చెందిన రంజాన్ అలీ(30), దేవదుర్గ తాలూకా బెళకల్లో ఉన్న హసీనా(25) కాన్పు కోసం బెళకల్ నుంచి దేవదుర్గకు వెళుతుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఢీకొట్టడంతో హసీనా అక్కడికక్కడే మరణించింది. రంజాన్ అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ధ్యానంతో ఆరోగ్య భాగ్యం
రాయచూరు రూరల్: మానవుడికి ధ్యానంతోనే ఆరోగ్య భాగ్యమని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత అన్నారు. నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన విశ్వ ధ్యాన దినోత్సవ సభను జ్యోతి వెలిగించి ప్రసంగించారు. యోగా, ధ్యానం వల్ల ప్రపంచానికి భారత్కు గురువు స్థానం లభించిందన్నారు. అందరికీ శాంతి, ప్రపంచ సద్భావన ఆధారంగా మనిషి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో శారద, వనజాక్షి, అసిస్టెంట్ కమిషనర్ గజానన బళి, అరుణ, బసన గౌడ, ప్రభణ్ణ గౌడ, వెంకట సింగ్, ప్రేమ కలాల్లున్నారు.
స్లం వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
రాయచూరు రూరల్: మురికి వాడల కాలనీల్లో నివాసమున్న వాసులకు ఇళ్ల పట్టాలను అందించాలని మురికి వాడల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. 1991–92లో సర్వే నంబర్–572, 573, 574ల్లో నివాసముంటున్న వారికి నేటికీ పట్టాలు ఇవ్వకుండా నగరసభ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురికి కాలువల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
బొగ్గు చోరీ బాధ్యులపై క్రిమినల్ కేసు వేయాలి
బొగ్గు చోరీ బాధ్యులపై క్రిమినల్ కేసు వేయాలి


