సౌకర్య లోపం.. ప్రజలకు శాపం
హుబ్లీ: నగరానికి వివిధ పనుల కోసం విచ్చేసే ప్రజలకు ప్రకృతి బాధలైన మూత్ర, మలవిసర్జన ఎక్కడ చేయాలో తెలియక పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు కాసింత పరికించి చూస్తే తేటతెల్లం అవుతుంది. మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాల్సిన హుబ్లీ ధార్వాడ సిటీ కార్పొరేషన్ ఆవరణలో శౌచాలయం ఉండీ లేనట్లుగా అఘోరించడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. పాలికెకు వివిధ పనుల కోసం నిత్యం వందలాది మంది వస్తుంటారు. మూత్రవిసర్జన బయలు ప్రదేశంలో చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక బహిర్భూమి సంగతి సరేసరి. వీటిపై జాగృత పరిచే పాలికె ఆవరణలో ఇలాంటి దుస్థితి ఉన్నా కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పాలించే ప్రజాప్రతినిధులు గాని సంబంధిత ఉన్నతాధికారులు కాని వారి చేతికింద ఉన్న సిబ్బంది కానీ ఈ దుస్థితి గురించి పట్టించుకోవడం లేదు. పాలికె ఆవరణలో ఓ శౌచాలయాన్ని నిర్మించారు. నిర్వహణ కొరతతో సంవత్సరాలుగా దాన్ని వాడటానికి సాధ్యపడటం లేదు. ఆ మరుగుదొడ్డి లోపలికి వెళితే తరతరాల వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. దీంతో స్థానికులు బహిర్భూమి ప్రాంతంలోనే తమ ఒకటి, రెండు సమస్యలను తీర్చుకుంటున్నారు.
పాలికె ఆవరణలో మరుగుదొడ్ల స్వచ్ఛత, ఉత్తమ ఆరోగ్యం కోసం మరుగుదొడ్డినే వాడండి అన్న నినాదం వెక్కిరిస్తోంది. అయితే శౌచాలయానికి ముక్కు మూసుకొని వెళ్లక తప్పడం లేదు. మరుగుదొడ్డిలో తగిన నీటి వసతి కూడా కరువైంది. వివిధ పనుల కోసం పాలికె ఆవరణలోకి అడుగు పెట్టిన ప్రజలకు శౌచాలయ సమస్య నరకయాతన దర్శనమిస్తుంది. మొత్తం మీద బయలు మరుగుదొడ్డి ఇక్కడ తప్పనిసరి అని స్థానిక తంతు క్షౌ రశాల యజమాని చెన్నమ్మ సర్కిల్ అంగడి నివాసి గోవిందరాజులు, మంజునాథ్, సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి ఉండగా దీంతో వీరు వాటినే వాడతారు. అయితే జనసామాన్య ప్రజలకు ఉండే ఒకే ఒక్క శౌచాలయం ఉండగా నిర్వహణ కొరతతో చెత్తచెదారానికి మరుగుదొడ్లు నెలవయ్యాయి.
పాలికెకు వచ్చిన సార్వజనికులు సమీపంలోని హోటల్పై ఆధారపడుతూ తమ ఈతి బాధలను అక్కడికి వెళ్లి తీర్చుకుంటున్నారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్ తిప్పణ్ణ మజ్జిగి ఈ సమస్యపై స్పందించారు. స్థానికులకు అవసరమైన వసతులు కల్పించడం పాలికె కర్తవ్యం అని పాలికె కమిషనర్తో మరుగుదొడ్ల మరమ్మతులతో పాటు నిర్వహణ తీరు గురించి చర్చిస్తానన్నారు. మేయర్ జ్యోతి పాటిల్ తక్షణమే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చి తగిన సూచనలు చేసిన అధికారి ప్రబుద్ధులు సాక్షాత్తు మేయర్ ఆదేశాలను కూడా పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలికె ఆవరణలో ఉన్న సార్వజనిక మరుగుదొడ్లకు తక్షణమే మరమ్మతులు చేయించి పాలికె పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పాలికె కమిషనర్ డాక్టర్ రుద్రేష్ గాలి తెలిపారు.
హుబ్లీలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయం
హుబ్లీలోని కిత్తూరు రాణి చెన్నమ్మ కూడలి
నగరంలో కాలకృత్యాలు తీర్చుకునేదెలా?
నగరానికి వచ్చిన ప్రజలకు
తప్పని తిప్పలు
కానరాని ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు
పట్టించుకోని హుబ్లీ–ధార్వాడ
మహానగర పాలికె యంత్రాంగం
సమస్యలమయంగా మరుగుదొడ్లు
ఈతి బాధలకు హోటలే గతి
సౌకర్య లోపం.. ప్రజలకు శాపం


