
పెళ్లి చేసి పంపాలనుకున్నాం..
పాడె కట్టి సాగనంపారు
తొక్కిసలాటలో మృతి చెందిన సహనకు అంత్యక్రియలు
కోలారు: బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మరణించిన కోలారు యువ ఇంజినీరు సహన (23)కు గురువారం కోలారులో కన్నీటి వీడ్కోలు పలికారు. కోలారు నగరంలోని ఉపాధ్యాయ దంపతుల కుమార్తె అయిన సహన ఇంజినీరింగ్ పూర్తి చేసి బెంగుళూరులోని బాష్ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. కోలారులోని ఎస్జి కాలనీలో కుటుంబం నివసిస్తోంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా సహన పెద్ద కూతురు. కంపెనీ సహోద్యోగులతో కలిసి విక్టరీ పరేడ్ను చూడాలని స్టేడియం వద్దకు వెళ్లింది. తొక్కిసలాటలో కిందపడిన సహనపై వందల సంఖ్యలో జనం తొక్కుకుంటూ వెళ్లడంతో మృత్యువు పాలైంది. వెంటనే సహన తల్లిదండ్రులు హుటాహటిన బెంగుళూరుకు వెళ్లారు. పోస్టుమార్టం ముగిశాక కూతురు మృతదేహాన్ని కోలారుకు తీసుకువచ్చారు.
త్వరలో పెళ్లి చేయాలనుకున్నాం – తండ్రి
పెళ్లీడుకు వచ్చిన కుమార్తెను కోల్పోయిన కన్నవారు విచార సాగరంలో మునిగిపోయారు. కుమార్తె పార్థివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు. కుమార్తెకు ఈ ఏడాదే పెళ్లి సంబంధాలు చూసి వివాహం చేయాలని అనుకున్నామని తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిందని తండ్రి సురేష్బాబు విలపించారు. మెట్టినింటికి సాగనంపడానికి బదులు పాడె కట్టి పంపాల్సి వచ్చిందని బంధువులు రోదించారు.

యువ ఇంజినీరు సహన