
మంగళూరులో హత్య.. 8 మంది అరెస్టు
బనశంకరి: హిందూ కార్యకర్త, రౌడీషీటర్ సుహాస్శెట్టి హత్యకేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు మంగళూరు నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. శనివారం హోంమంత్రి పరమేశ్వర్ తో కలిసి వివరాలను వెల్లడించారు. మంగళూరువాసులు అబ్దుల్ అప్వాన్, నియాజ్, మహమ్మద్ ముజామిల్, రిజ్వాన్, చిక్కమగళూరువాసి కలందర్ షఫీ, అదిల్ మహరూఫ్, నాగరాజ్, రంజిత్ అనే నిందితులను అరెస్ట్చేశామని తెలిపారు. కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నామని, ఆ వివరాలను తరువాత వెల్లడిస్తామని చెప్పారు. సుహాస్ శెట్టి హత్యకు గురైన కొద్ది నిమిషాల్లో ఫినిష్ అనే పోస్టర్ను సోషల్ మీడియాలో ఎవరు పెట్టారనేది విచారణ జరుగుతోందన్నారు. గురువారం రాత్రి మంగళూరులో సుహాస్శెట్టి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మినీగూడ్స్ వాహనంతో ఢీకొట్టి, అతన్ని బయటకు లాగి నరికి చంపడం తెలిసిందే. దీంతో నగరంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య దృశ్యాల సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు.
మత కలహాలకు అడ్డుకట్ట: హోంమంత్రి
అప్పుడప్పుడు మతకలహాలు తలెత్తే దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలో యాంటీ కమ్యూనల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేస్తామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. కరావళి జిల్లాల్లో మతకలహాల నివారణకు కృషి చేస్తామన్నారు. మతకలహాలకు కారణమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగరాదని తెలిపారు. కాగా, మంగళూరు సర్క్యూట్ హౌస్లో పరమేశ్వర్ పోలీసు అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమయంలో కొందరు ముస్లిం నేతలు చేరుకుని గందరగోళం సృష్టించారు. హోంమంత్రి టేబుల్ పై కొడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళూరులో హత్య.. 8 మంది అరెస్టు