
కశ్మీర్ ఉగ్రవాదులు ఏమైనా మాట్లాడారా?
బనశంకరి: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బెంగళూరువాసి భరత్ భూషణ్ ఇంటికి సోమవారం ఎన్ఐఏ అధికారులు వచ్చారు. దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆయన సతీమణి సుజాత, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నగరంలోని మత్తికెరెలోని ఇంటికి వెళ్లి కశ్మీర్ దాడి గురించి సమాచారం తీసుకున్నారు. కొందరు ఉగ్రవాదుల ఫోటోలను చూపించి వివరాలు అడిగారు. ఏ ట్రావెల్ ఏజెన్సీ నుంచి కశ్మీర్ టూర్ని బుక్ చేసుకున్నారు అని తెలుసుకున్నారు. కశ్మీరులో ఎక్కడ ఉన్నారు, ఎంత సమయానికి పహల్గాంకి వెళ్లారు, ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఏ భాష మాట్లాడారు అనే సమాచారాన్ని సేకరించారు.
సుమారు 12 గంటల పాటు భరత్భూషణ్ నివాసంలోనే ఎన్ఐఏ అధికారులు ఉండడం గమనార్హం. ఉగ్రవాదులు చంపేముందు భరత్భూషణ్తో ఏమైనా మాట్లాడారా, మీతో ఏమైనా మాట్లాడారా, హంతకుల ముఖ కవలికలు గుర్తు ఉన్నాయా, ముఖాలు ఎలా ఉన్నాయి, ముఖాలపై ఏవైనా గుర్తులు ఉన్నాయా అని సుజాతను ప్రశ్నలు అడిగారు. సుమారు 14 మందికి పైగా అనుమానితులు ఫోటోలను చూపించి వీరిలో ఆ టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారా అనేది అడిగారు. అన్నింటినీ ల్యాప్టాప్, పుస్తకాలలో నమోదు చేసుకున్నారు. శివమొగ్గలోని మంజునాథరావ్ ఇంటికి వెళ్లి ఇదే మాదిరి విచారణ చేయనున్నారు.
భరత్భూషణ్ ఇంటికి ఎన్ఐఏ అధికారులు
భార్య సుజాత నుంచి సమాచార సేకరణ