
మనవరాలిపై అఘాయిత్యం
● కామాంధుడు అరెస్టు
మైసూరు: మనవరాలి వరసయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ అమానుష సంఘటన జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకాలో జరిగింది. వివరాలు.. హెచ్డీకోటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన మరిగౌడ (62) నిందితుడు. మైసూరులో ఉండే భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమార్తెను తీసుకుని గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వచ్చారు. బాలికకు స్కూలు సెలవులు ఉండడంతో బంధువుల ఇంటిలోనే ఉంచి వెళ్లిపోయారు. బాలికకు తాత అయ్యే నిందితుడు మాయమాటలతో పాపపై అత్యాచారానికి పాల్పడటమేగాక ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత బాలిక మైసూరులోని తమ ఇంటికి చేరుకుంది. చిన్నారి విచారంగా ఉండడం గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది? అని విచారించగా, దారుణాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గ్రామానికి వెళ్లి పోక్సో చట్టం కింద అరెస్టు చేసి తరలించారు.
ఫిర్యాదు చేస్తే ఖాతా బ్లాక్
● బీబీఎంపీ విడ్డూరం
బనశంకరి: గుంతల రోడ్ల గురించి బీబీఎంపీకి ఎక్స్ అకౌంట్లో ఫిర్యాదు చేసిన మహిళ అకౌంట్ ను పాలికె సిబ్బంది బ్లాక్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నీతు అనే మహిళ కొన్ని గుంతల రోడ్లు ఫోటోలు పోస్ట్ చేసి మరమ్మతులు చేయాలని పాలికెను కోరింది. దీనిపై బీబీఎంపీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆమె అకౌంట్ను బ్లాక్ చేసింది. ఈమె మాదిరిగా ఫిర్యాదులు చేసిన మరికొందరి ఖాతాలను కూడా పాలికె సిబ్బంది బ్లాక్ చేసినట్లు తెలిసింది. నగరంలో గుంతల రోడ్లే కాదు ఏ సమస్య అయినా సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పాలికె కమిషనర్ తెలిపారు. కానీ పరిష్కరించడానికి బదులు బ్లాక్ చేయడం గమనార్హం. పాలికె చర్య సబబు కాదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేల సస్పెన్షన్పై
హైకోర్టుకు బీజేపీ?
బనశంకరి: ఇటీవల నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో అగౌరవంగా ప్రవర్తించారని 18 బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ యుటీ ఖాదర్ 6 నెలలపాటు సస్పెండ్ చేశారు. దీనివల్ల సదరు ఎమ్మెల్యేలకు జీతభత్యాల్లో కోత పడనుంది. పలు చిక్కులు కూడా ఎదురవుతాయి. సస్పెన్షన్ను రద్దు చేయాలని బీజేపీ నేతలు కోరినా స్పీకర్ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టులో కేసు దాఖలు చేయాలని నేతలు ఆలోచిస్తున్నారు. చివరి అవకాశంగా సోమవారం స్పీకర్ ను కలిసి మనవి చేయాలని పార్టీ పక్ష నేత ఆర్.అశోక్ ప్రయత్నిస్తున్నారు. భేటీ తరువాత కూడా ఫలితం లేకపోతే హైకోర్టు మెట్లెక్కాలని తీర్మానించారు.
ధర్మరాయస్వామి కరగ
మాలూరు: పట్టణంలో కొలువైన శ్రీ ధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవాన్ని శుక్రవారం అర్ధరాత్రి అపార భక్త సమూహం నడుమ రమణీయంగా నిర్వహించారు. ద్రౌపతాంబ దేవి ఆలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసుపు వస్త్రాలను ధరించిన కరగ పూజారులు, మునిరాజ్, నాగరాజ్, అభిషేక్లు కరగను తలపై మోసుకుని నృత్యాలు చేస్తూ ఊరేగారు.