హుబ్లీ: అన్నదాతలు కొత్త కొత్త ఆవిష్కారాలతో సరికొత్త రీతిలో పంటలను సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ధార్వాడ తాలూకాలో ఓ రైతన్న పచ్చ పుచ్చకాయల సాగు చేసి లాభాలు సాధించారు. తాలూకాలోని కురుబగట్టి గ్రామానికి చెందిన మైలారప్ప గుడ్డప్పనవర అనే యువ రైతన్న పచ్చరంగు పుచ్చకాయలు పండించి 4 నుంచి 5 కేజీల తూకం ఉన్న పుచ్చకాయను జిల్లాధికారిణి దివ్యప్రభు ఎదుట ప్రదర్శించారు. క్షేత్రోత్సవంలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారులు సదరు పొలంలో జిల్లాధికారి దివ్యప్రభు తదితర అధికారులతో ఈ పంట తీరును వీక్షించారు. ఓ ఎకరా పొలంలో పచ్చరంగు పుచ్చకాయతో పాటు ఎరుపు రంగు పుచ్చకాయలను కూడా సాగు చేశారు. ఆ మేరకు రూ.లక్ష చొప్పున ఎకరాకు ఖర్చు పెట్టి సుమారు రూ.3.50 లక్షల ఆదాయం గడించినట్లుగా ఆ రైతు మైలారప్ప గుడ్డప్పనవర తెలిపారు.
పొలాన్ని పరిశీలించిన
అధికారులు
కురుబగట్టి మినహా ధార్వాడ తాలూకాలోని బాడ గ్రామ రైతు కల్లనగౌడ పాటిల్ కూడా పచ్చరంగు పుచ్చకాయ సాగు చేశారు. రైతుల ఈ వినూత్న సాగుకు జిల్లాధికారిణి దివ్యప్రభు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ వారిద్దరిని మనస్ఫూర్తిగా అభినందించారు. కురుబగట్టి మైలారప్ప పొలాన్ని పరిశీలించిన డీసీ పచ్చ రంగు పుచ్చకాయలను చూసి ఆశ్చర్యంతో పండు రుచిని కూడా చవి చూశారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త జాతి పండు సాగుకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ఇస్తుందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఒక ఎకరంలో పచ్చరంగు పుచ్చకాయలను సుమారు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఈ పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీకి సుమారు రూ.30 ధర పలుకుతోంది. కాగా ఈ పండు అత్యంత రుచికరంగాను, మధురంగా కూడా ఉంటోందని రైతులు తెలిపారు.
పచ్చ పుచ్చ సాగుతో యువ రైతుల లాభాల బాట
శభాష్ అని అభినందించిన
జిల్లాధికారిణి దివ్యప్రభు
పుచ్చకాయల సాగు.. లాభాలు బాగు
పుచ్చకాయల సాగు.. లాభాలు బాగు