Karnataka: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే

- - Sakshi

బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు.

2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్‌.నిజలింగప్ప, దేవరాజ అరస్‌లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్‌ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు.

మైసూరు సీఎం.. ఎస్‌.నిజలింగప్ప
కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్‌.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్‌ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్‌ 1962 వరకు సీఎంగా ఎస్‌ఆర్‌ కంఠి ఎన్నికయ్యారు. జూన్‌ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు.

పథకాల్లో దేవరాజ్‌ అరస్‌ ముద్ర
మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దేవరాజ అరస్‌ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top