మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారు. అందరు కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడతారు. అందరికి ఏదోఒక కుటుంబ బంధం ఉంటుంది. ప్రతీ పండుగను కలిసి చేసుకుంటారు. 30ఏళ్లుగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఊరు మొత్తంలో ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. గ్రామ నడిబొడ్డున ప్రతిమను ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి ఊరంతా కలిసి గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1990లో నలుగురు వ్యక్తులు కలిసి గణనాథుడిని ప్రతిష్టించాలని ఆలోచన చేశారు. తాటా కులతో మండపం వేశారు. అదే ఆనవాయితీతో ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.


