జగిత్యాలరూరల్: జగిత్యాల పట్టణం గాంధీనగర్కు చెందిన నర్సమ్మపై ఆమె అల్లుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీనగర్కు చెందిన నర్సమ్మ కుమార్తె లక్ష్మిని మూడేళ్ల క్రితం టీఆర్నగర్కు చెందిన కట్ట ప్రశాంత్కు ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో లక్ష్మి పుట్టింట్లో ఉంటోంది. వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నర్సవ్వ తన ఇంటి ఎదుట వాకిలి ఉడుస్తున్న సమయంలో అల్లుడు ప్రశాంత్ కత్తితో దాడి చేశాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
గుండెపోటుతో ఏఎల్ఎం మృతి
ఎలిగేడు: ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన ఇరుగురాల రాజయ్య(46) ఏఎల్ఎం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మారేడుగొండలో ఏఎల్ఎంగా పనిచేస్తున్న ఇరుగురాల రాజయ్య శనివారం సాయంత్రం తన విధులు ముగించుకొని ధూళికట్టలోని ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసిన అనంతరం రాత్రి భోజనం చేసిన తర్వాత ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు తెలపడంతో వెంటనే 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు రాజయ్యకు భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.
ఇంటిదొంగను పట్టించిన సీసీ కెమెరా
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు ఎల్ల మ్మ ఆలయ పరిసరాల్లో మేకల మండిలో నుంచి రెండు మేకలు మాయమయ్యాయి. మండల కేంద్రమైన పాలకుర్తికి చెందిన యజమాని అదే గ్రామానికే చెందిన యువకుడిని పనిలో ఉంచుకున్నాడు. నమ్మకంగా ఉంటాడని అనుకుంటే ఇలా జరిగిందేంటని ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా మేకలు అమ్మి ఆ డబ్బు యజమానికి ఇవ్వలేదనే నిర్దారణకు వచ్చాడు. ఆదివారం సదరు యువకుడిని పిలిచి మేకల సంగతేంటని నిలదీశాడు. తనకేం తెలియదని చెప్పడంతో సీసీ పుటేజీలను చూపించాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియని సదరు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.


