● మంకమ్మతోట శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
కరీంనగర్ కల్చరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్లో ఆధ్యాత్మికతకు దేశభక్తి తోడైంది. మంకమ్మతోట శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారిని జాతీయ జెండాలోని త్రివర్ణాలను ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల పుష్పాలతో అలంకరణ చేశారు. దేశ స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ ఆలయ అర్చకులు చేపట్టిన ఈ ప్రత్యేక అలంకరణ ఆధ్యాత్మికతతోపాటు దేశభక్తి సందేశాన్ని చాటింది. త్రివర్ణ పుష్పాల మధ్య కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
ప్రశంస.. పదిలం
కరీంనగర్ అర్బన్: కలెక్టర్ చిత్రామిశ్రా నిర్ణయాన్ని ఉద్యోగ లోకం హర్షించింది. ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం పరిపాటి. ల్యామినేషన్ పేపర్ ద్వారా ఉండే పత్రాలను అందజేస్తుండటం జరిగే ప్రక్రియ. కలెక్టర్ చిత్రామిశ్రా చిరకాలం నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. శనివారం 288 మందికి ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు అందజేయగా, వాటికి ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. కాగితం కాకుండా ఫ్రేమ్తో ఇవ్వడంతో ఇంట్లో గుర్తుగా పెట్టుకోవచ్చని, కలెక్టర్ నిర్ణయం బాగుందని సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
భళా.. వ్యవసాయశాఖ
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వ నిర్ణయాల అమలులో క్రీయాశీలకంగా వ్యవహరించి జిల్లా వ్యవసాయ శాఖ శభాష్ అనిపించుకుంది. శనివారం హైదరాబాద్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేదికగా రాష్ట్ర స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్గా ప్రథమ స్థానం అవార్డు పొందింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మికి ఆ శాఖ డైరెక్టర్ గోపి అవార్డు అందజేశారు.
జెండా పంచాయితీ.. పోలీస్ పహారా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం మొ గ్ధుంపూర్లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివా దమేర్పడింది. పంచాయితీ పోలీస్స్టేషన్కు చేరింది. శనివారం పోలీసులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఏటా కుల సంఘం కూకట్ల మల్లయ్య జెండా ఎగురవేయడం అనవాయి తీ వస్తోందని, పెద్దమనిషి మృతిచెందడంతో అతని కుమారుడు తిరుపతికి అవకాశం ఇవ్వాలని యాదవ సంఘం ప్రతినిధులు చెప్పగా సహకార సంఘం అధ్యక్షుడిగా తనకే జెండా ఎగురవేసే అధికారముందని బండి మల్లయ్య తెలిపారు. ఇరువర్గాల వాగ్వాదంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చర్చల అనంతరం ఇరువర్గాల ఆమోదంతో మరో పెద్దమనిషి దాడి నర్సయ్య జాతీయజెండాను ఎగురవేయడంతో వివాదం సద్దుమణిగింది.


