కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు అవమానించాయంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. కిసాన్నగర్ గాంధీ విగ్రహం నుంచి మంచిర్యాల చౌరస్తా మీదుగా కోర్టు వరకు ర్యాలీ సాగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయం వైపు వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఉత్తరాఖండ్లో మల్లికార్జున ఖార్గే పాల్గొన్న సభ వేదికను అపవిత్రం అయిందంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దుష్టశక్తులు శుద్ధిచేయడాన్ని ఖండించారు. ఇది ఖార్గేకు జరిగిన అవమానం కాదని, యావత్దళిత బహుజనులకు జరిగిన అవమానమన్నారు. పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, నరేందర్రెడ్డి, ఉప్పుల అంజనీ ప్రసాద్ , మల్లికార్జున రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


