కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధికిఽ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు పనుల్లో వేగం, నాణ్యత కోసం అజాక్ష్ సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నగరపాలకసంస్థ 35వ డివిజన్లో అజాక్ష్ ఆధునిక యంత్రంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. యంత్రాన్ని స్వయంగా నడిపి పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమన్నారు. అజాక్ష్ యంత్రం ద్వారా కాంక్రీట్ తయారీ, మిశ్రమ నిష్పత్తుల నియంత్రణ, నిర్మాణ ప్రాంతంలోనే కాంక్రీట్ సిద్ధం చేయడం, వేగవంతమైన సరఫరా వంటి ప్రయోజనాలు లభిస్తాయన్నారు. కార్పొరేటర్ సుజాత, శ్రీనివాస్ ఉన్నారు.
డివిజన్లలో వసతులకు కృషి
ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరపాలకసంస్థ 21వ డివిజన్ కొత్తయాస్వాడలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి ప్రారంభించారు. లైట్ల ఏర్పాటుతో కొత్తయాస్వాడ ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పాయన్నారు.


