వాగు రెండు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. ఈ మాత్రం దానికి పెద్దపల్లి జిల్లా మీదుగా రాకూడదంటే ఎలా అని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి హెచ్చరికలు గతంలో తామెప్పుడూ చూడలేదని, అన్ని అనుమతులు ఉంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల మధ్య రవాణా చేసుకునే వీలున్నప్పుడు పెద్దపల్లి జిల్లాకు ఈ ఆదేశాలు ఎందుకు వర్తించడంలేదో తమకు అర్థం కావడంలేదని అంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఒకే మైనింగ్ పాలసీ ఉండాలని కానీ, జిల్లాకో పాలసీ ఏంటని నిలదీస్తున్నారు. దీనిపై క్వారీ నిర్వాహకులు, ఇటుకబట్టీ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.
– సాక్షిప్రతినిధి,కరీంనగర్
మానేరు నదీతీరం మీదుగా జగిత్యాలకు మట్టిదుబ్బ లోడుతో వెళ్తున్న లారీలను పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. అన్ని అనుమతి పత్రాలు చూపినా వాహనాలను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలించిన నేరానికి జరిమానా విధిస్తున్నామని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీచేయడంతో వ్యాపారులు అవాక్కయ్యారు. మట్టిదుబ్బ లారీలను సీజ్ చేసి ఇసుక అక్రమ రవాణా అంటూ ఆదేశాల్లో ఎలా పేర్కొంటారంటూ వాపోతున్నారు. అన్ని అనుమతులు ఉన్న తమను ఎందుకు వేధిస్తున్నారని ఆరాతీయగా.. తమ జిల్లా నుంచి వాహనాలు రాకూడదని, అది అక్రమమని అందుకే కేసులు పెడుతున్నామని మైనింగ్, పోలీసు డిపార్ట్మెంట్ అధికారులు పేర్కొంటున్నారు.


