వేములవాడరూరల్: వేములవాడకు చెందిన కళాకారుడు మారం ప్రవీణ్కుమార్(పప్పి) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యానికి రూ.లక్షల్లో అవసరం అవుతుండగా.. దాతల సాయం కోరుతూ ‘సాక్షి’ దినపత్రికలో ’కళాకారునికి కష్టకాలం’ శీర్షికన ఈనెల 12న కథనం ప్రచురితమైంది. వేములవాడ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాదాడి గజానందరావు కథనానికి స్పందించారు. 30ఏళ్లుగా తన వెంట ఉంటూ, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ప్రవీణ్కు రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తానని, ఆపరేషన్ తరువాత కూడా మూడు నెలల వరకు ఖర్చులు భరిస్తానని తెలిపారు. మారం ప్రవీణ్ మాట్లాడుతూ కష్టాల్లో తోడుగా నిలిచినందుకు గజానందరావుకు కృతజ్ఞతలు తెలిపాడు. గజానందరావు మానవతా దృక్పథాన్ని పట్టణ ప్రజలు అభినందించారు. మరికొంత మంది ఆర్థికసాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.


