కరీంనగర్కార్పొరేషన్: ‘నీకు నువ్వే అపరమేధావి అనుకుంటున్నవ్. కరువును రాజకీయానికి వాడుకొంటున్నవ్. కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నెకరాలకు నీళ్లిచ్చారో చెప్పు’? అంటూ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బీఆర్ఎస్ నేత కేటీఆర్పై మండిపడ్డారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతాంగానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం నీళ్లిచ్చారో అప్పటి బీఆర్ఎస్ మంత్రులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి రైతుల పొట్టలు కొట్టి మెదక్ జిల్లాకు నీళ్లుతీసుకెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతోనే ఉమ్మడి జిల్లా రైతాంగానికి నీళ్లు అందుతున్నాయన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు 8 లక్షల ఎకరాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్తో అంతకుమించి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు పెరగలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనిగా ఉందన్నారు. మేడిగడ్డ కుంగిందని, అన్నారం, సుందిళ్లలో బుంగలు పడ్డాయన్నా రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారంరోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వర్షాభావంతో పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నంచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సుడా మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, కార్పొరేటర్లు నర్సింగం, జగన్రెడ్డి, మల్లేశం ఉన్నారు.


