ఇబ్రహీంపట్నం: మండలంలోని ఎర్దండిలో గంగమ్మమాత, రామాలయం ఆలయ పూజారి కులకర్ణి ప్రణవ నరహరి (28) గోదావరిలో శవమై తేలాడు. ఆదివారంసాయంత్రం రామాలయంలో పూజలు చేసిన ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెదుకుతున్నారు. బుధవారం కూడా గ్రామస్తులతో కలిసి వెదుకుతుండగా.. గోదావరిలో శవమై కనిపించాడు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దారితప్పి గోదావరివైపు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి ఈత రాక మృతి చెందినట్లు నరహరి తండ్రి దత్తత్రేయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
మెట్పల్లిరూరల్: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెట్పల్లి మండలం మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాశబోయిన అరుణ్(35)కు భార్య రోజతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పది రోజుల క్రితం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో రోజ పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన అరుణ్ ఇంట్లో ఉరేసుకున్నాడు. అరుణ్ పెద్దనాన్న బాబయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పనులు చేయక.. మద్యానికి బానిసై..
సుల్తానాబాద్ రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన భూపతి తిరుపతి(47) బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్ర కుమార్ కథనం ప్రకారం.. తిరుపతి పనులు ఏమీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. మనస్తాపం చెందిన తిరుపతి రోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. తల్లి మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రతిమ ఆస్పత్రిలో విద్యుత్షార్ట్ సర్క్యూట్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఆస్పత్రిలో బుధవారం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం ఏర్పడింది. ఆస్పత్రి వర్గాల కథనం మేరకు ఆపరేషన్ థియేటర్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలేర్పడి పొగలు వ్యాపించాయి. వెంటనే ఆప్రమత్తమైన సిబ్బంది థియేటర్ సమీపంలోని వార్డుల్లో ఉన్న రోగులను వేరే ప్రాంతానికి తరలించారు. చిన్నషార్ట్ సర్క్యూట్తో ఏర్పడిన మంటలను ఆర్పివేసి యథాతథంగా ఆపరేషన్ థియేటర్ను నిర్వహించారు.
ఇంటి తాళం పగలగొట్టి చోరీ
గంగాధర: వుండలంలోని మధురానగర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. బొడ్ల శ్రీనివాస్ మొదటి అంతస్తును విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్కు తాళం వేసి ఉంచాడు. బుధవారం ఉదయం విజయ్ కిందికి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో పాటు తన బైక్ కనిపించలేదు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. దొంగలు బీరువా పగుల గొట్టి రెండు గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించారని బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
ఆలయాల్లో..
శంకరపట్నం: మండలంలోని లింగాపూర్ ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు, భక్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లోని అమ్మవారి విగ్రహాలపై నగలు, భక్తులు హుండీలో వేసిన కానుకలు దోచుకెళ్లారు. దొంగలు హుండీలను పగలగొట్టి సమీపంలోని బీడు భూముల్లో పడేశారు. బుధవారం ఆలయానికి వెళ్లిన భక్తులు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


